బైక్‌లు చోరీ చేసి.. అడవిలో దాచి..

ABN , First Publish Date - 2022-10-05T06:09:45+05:30 IST

వారు ముగ్గురు వ్యవసాయ కూలీలు. జల్సాలకు అలవాటు పడ్డారు. వచ్చే డబ్బులు చాలడం లేదు. బైక్‌ల దొంగతనాలకు ప్లాన్‌ చేశారు.

బైక్‌లు చోరీ చేసి.. అడవిలో దాచి..
సాఽ్వధీనం చేసుకున్న బైకులను పరిశీలిస్తున్న ఎస్పీ

55 బైక్‌లు కొట్టేసిన ముగ్గురు యువకులు

అరెస్టు చేసిన పోలీసులు


సత్తెనపల్లి, అక్టోబరు4: వారు ముగ్గురు వ్యవసాయ కూలీలు. జల్సాలకు అలవాటు పడ్డారు. వచ్చే డబ్బులు చాలడం లేదు. బైక్‌ల దొంగతనాలకు ప్లాన్‌ చేశారు. మొత్తం 55 బైక్‌లు కొట్టేసి అడవిలో దాచారు. మరో 5 దొంగిలించిన తర్వాత తలా 20 పంచుకుని అమ్ముకుందామనుకున్నారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మంగళవారం ఎస్పీ రవిశంకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌ఐ బాలకృష్ణ ఈనెల 3వ తేదీ మండలంలోని భృగుబండ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒక మోటర్‌సైకిల్‌పై పిడుగురాళ్ల నుంచి సత్తెనపల్లి వైపు వస్తూ పోలీసులను చూసి  వెనక్కి  పారిపోతుండగా  అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా వారు రాజుపాలెం మండలం ఉప్పలపాడుకు చెందిన వేల్పుల పేరయ్య,  వేల్పుల గోపి, జంపు వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మార్చినెల నుంచి తాము మోటర్‌ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మొత్తం 55 వాహనాలను దొంగిలించి  రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో దాచిపెట్టారు. మరో ఐదు మోటార్‌ సైకిళ్లు దొంగతనం చేసిన తరువాత ఒక్కక్కరు 20 చొప్పున పంచుకొని వాటిని అమ్మి డబ్బులను అవసరాలకు వాడుకోవటానికి ప్లాన్‌ చేసినట్లు తెలిపారు. సత్తెనపల్లి సబ్‌ డివిజన్‌పరిధిలో 16, నర్సరావుపేట సబ్‌డివిజన్‌ పరిధిలో 11, గురజాల సబ్‌డివిజన్‌ పరిధిలో 23 బైక్‌ దొంగతనాల కేసులు నమోదయ్యాయన్నారు. గుంటూరుజిల్లా పరిధిలో మరో ఐదు కేసులు నమోదయ్యాయన్నారు. వారి వద్ద నుంచి రూ.23.50లక్షల విలువైన 55 ద్విచక్రవాహనాలను రికవరీ చేసినట్లు  తెలిపారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ రూరల్‌ సీఐ సత్యబాబు, రూరల్‌ ఎస్‌ఐ ఆవుల బాలకృష్ణలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-05T06:09:45+05:30 IST