భార్యను గొంతుకోసి చంపిన భర్త
ABN , First Publish Date - 2022-09-13T05:36:20+05:30 IST
: అనుమానమే పెనుభూతమైంది.. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న భర్త చివరికి గొంతుకోసి ప్రాణం తీసుకున్నాడు.
గ్రీవెన్స్కు వెళ్లి తానే చంపానని తెలిపిన నిందితుడు
గుంటూరు(కార్పొరేషన్), సెప్టెంబరు12: అనుమానమే పెనుభూతమైంది.. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న భర్త చివరికి గొంతుకోసి ప్రాణం తీసుకున్నాడు. ఏకంగా అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్కు వెళ్లిన నిందితుడు తానే భార్యను చంపానని పోలీసులకు చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. పాతగుంటూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్నగర్ 2వ లైనులో ఉప్పుతల శ్రీనివాసరావు, భార్య భూలక్ష్మి(48) నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు. వారందరికీ వివాహాలు జరిగి వేర్వేరుగా నివసిస్తున్నారు. భార్య భూలక్ష్మి ప్రవర్తనపై భర్త శ్రీనివాసరావుకు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భూలక్ష్మిని శ్రీనివాసరావు కడుపులో కత్తితో పొడిచి, పీకకోసి చంపాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఇంటికి తాళం వేసి శ్రీశైలం వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. ఒంగోలు వరకు వెళ్లి తిరిగి మనసు మార్చుకొని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ వద్దకు చేరుకున్నాడు. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి భార్యను చంపినట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి పోలీసులు విచారిస్తున్నారు.