అమరావతిపై దుష్ప్రచారం తగదు
ABN , First Publish Date - 2022-09-17T06:06:00+05:30 IST
అమరావతి సెల్ఫ్ ప్రాజెక్టు అని రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 1004వ రోజుకు చేరుకున్నాయి.
1004వ రోజుకు రైతుల ఆందోళనలు
తుళ్లూరు, సెప్టెంబరు 16: అమరావతి సెల్ఫ్ ప్రాజెక్టు అని రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 1004వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ పవిత్రమైన అసెంబ్లీలో కూర్చొని పాలకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవసరం లేదన్నారు. అమరావతిపై పాలకుల దుష్ప్రచారం చేయటం తగదన్నారు. మూడు రాజధానులతో రాష్ట్ర ప్రగతి వెనకబడిపోయిందన్నారు. అమరావతిని స్వాగతిస్తున్నామంటూనే మూడు ముక్కల ఆటకు తెరతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదన్నారు. రైతుల పాదయాత్రను అవమానిస్తున్న వారు రాక్షసుల కంటే హీనం అన్నారు. న్యాయవ్యవస్థ అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు.