శిరోధార్యం కాదు.. ధిక్కరణే !

ABN , First Publish Date - 2022-09-08T05:42:29+05:30 IST

రాజధాని అమరావతి అభివృద్ధిపై రాష్ట్ర అత్యు న్నత న్యాయస్థానం తీర్పును శిరోధార్యంగా అమలు చేయాల్సింది పోయి అడుగడుగునా ధిక్కరణకు పాల్పడుతూ సీఎం జగన్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడని, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని రాజధాని అమరా వతికి భూములు త్యాగం చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శిరోధార్యం కాదు.. ధిక్కరణే !
తుళ్లూరు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు , రైతులు

రాజధాని అభివృద్ధిపై ఇంకా ఎన్నాళ్లీ మీనమేషాలు

అమరావతిపై ఎందుకీ కుట్రలు, కుతంత్రాలు

995వ రోజుకు చేరుకున్న రైతుల, మహిళల ఆందోళనలు

తుళ్లూరు, సెప్టెంబరు7: రాజధాని అమరావతి అభివృద్ధిపై రాష్ట్ర అత్యు న్నత న్యాయస్థానం తీర్పును శిరోధార్యంగా అమలు చేయాల్సింది పోయి అడుగడుగునా ధిక్కరణకు పాల్పడుతూ సీఎం జగన్‌రెడ్డి  నియంతలా వ్యవహరిస్తున్నాడని, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని రాజధాని అమరా వతికి భూములు త్యాగం చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌  అంటూ రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారం నాటికి 995వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్ముతూనే ఉందన్నారు. వైసీపీ నేతలు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎడారి, ముంపు, శ్మశానం అని ప్రచారం చేస్తూ పూర్తిగా అభివృద్ధిని విస్మరించే ప్రయత్నం చేశారన్నారు.  రైతుల త్యాగాలను తీవ్రంగా అవమాన పరిచారన్నారు. ఈ అన్ని కుట్రలను తిప్పికొడుతూ అమరావతి నిలబడిందన్నారు. ఈ విషయాన్నే వైసీపీ అధినేత, ఆయన భజన భృందం జీర్ణించుకో లేకపోతుందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కొత్తగా సీఆర్డీఏ చట్టానికి సవరణలుచేసి మాస్టర్‌ప్లాన్‌ను విచ్ఛిన్నం చేయాలనే  కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహాం వ్యక ్తం చేశారు. ఇది ఉన్నత న్యాయస్థానం తీర్పును ధిక్కరించటమేనని పేర్కొన్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు అవాంతరాలు కలిగిస్తే అమరావతిని మరింత నాశనం చేయవచ్చని వైసీపీ అల్ప బుద్ధులు అనుకుంటున్నారన్నారు. ఇప్పటికే రాజధాని ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుందన్నారు. ఇది ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం, నేతలు మహా పాదయాత్రను అడ్డుకునే  ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా కోర్టుకు వెళ్లేట్లు చేశారన్నారు. ఎన్ని అడ్డుంకులు పెట్టినా మరో మహా పాదయాత్ర అమరావతి టూ అరసవల్లి ఆగదన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా అమరావతి అభివృద్ధిని కొనసాగించి ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలన్నారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు, దీక్షలు కొనసాగాయి. దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు.


Updated Date - 2022-09-08T05:42:29+05:30 IST