అమరావతిని నిర్వీర్యం చేయటంతో కుంటుపడిన ప్రగతి

ABN , First Publish Date - 2022-07-18T06:03:44+05:30 IST

రాష్ట్ర నడిబొడ్డులో అన్ని హంగులతో నిర్మితమవుతున్న రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయటంతో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని రాజధానికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

అమరావతిని నిర్వీర్యం చేయటంతో కుంటుపడిన ప్రగతి
బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న వెలగపూడి ధర్నా శిబిరంలోని రైతులు

944వ రోజుకు చేరుకున్న  రైతుల ఆందోళనలు

తుళ్లూరు, జూలై 17! రాష్ట్ర నడిబొడ్డులో అన్ని హంగులతో  నిర్మితమవుతున్న రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయటంతో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని రాజధానికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. అన్నీ సౌకర్యాలతో గత ప్రభుత్వంలో రూపుదిద్దుకున్న రాజధాని అమరావతి అభివృద్ధి కొనసాగితే అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదని వారు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి 944వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, మూడు ముక్కల ఆటతో మూడేళ్లు కాలం వెళ్లబుచ్చారన్నారు. మూడు రాజధానులనేది రాజ్యాంగంలోనే లేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన జరుగుతుందన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేసి అమరావతి అభివృద్ధి చేయాలన్నారు. లేదంటే స్వచ్ఛందంగా పాలకులు  వైదొలగాలన్నారు. అభివృద్ధిని మరచిపోయి ప్రతీకారాలు తీర్చుకోవడానికి పాలన చేస్తున్నారన్నారు. అందులో రైతులను ఇరికించి నానా అవస్థలు పెడుతున్నారన్నారు.  న్యాయం చేయమని అడుగుతుంటే అక్రమ కేసులు పెట్టి రాజధానికి భూములిచ్చిన రైతులకు నరకం చూపెడుతున్నారని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధే ఆంధ్రులకు ప్రగతన్నారు. కాని ప్రభుత్వానికి జనంతో పని లేదని, అత్యధిక సీట్లు ఇవ్వటంతో అధికార మదంతో ప్రజల గురించి పట్టించుకోవటం మానేశారన్నారు. ఇప్పటికైనా  అహంకారాన్ని వదిలేసి అమరావతి అభివృద్ధిని పూర్తి చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. జై అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.

Updated Date - 2022-07-18T06:03:44+05:30 IST