పోషకాలు.. పెనుబారం

ABN , First Publish Date - 2022-11-24T00:37:21+05:30 IST

జిప్సం, జింకు, బోరాన్‌ తదితర సూక్ష్మ పోషకాలు భూమి సారానికి అవసరం.

పోషకాలు.. పెనుబారం

రెండేళ్లుగా రాయితీకి రాంరాం

పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం

నాడు ఉచితం.. నేడు ఇండెంట్‌తో సరి

బాపట్ల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిప్సం, జింకు, బోరాన్‌ తదితర సూక్ష్మ పోషకాలు భూమి సారానికి అవసరం. గత ప్రభుత్వ హయాంలో వీటిని రైతులకు ఉచితంగా అందజేసేవారు. తద్వారా భూమిలో పోషకాలు పెరిగి ఆశాజనంగా పంట దిగుబడులు వచ్చేవి. అయితే పాలకులు మారగానే పోషకాల భారం రైతులపై పడింది. రెండేళ్ల నుంచి ఖరీఫ్‌, రబీ సీజన్‌ ప్రారంభం కాగానే రైతులకు కావాల్సిన సూక్ష్మ పోషకాల విషయంలో ఇండెంట్‌ పెడుతున్నాం.. రాగానే రైతులకు రాయితీపై అందిస్తామనే మాటలతో పాలకులు సరిపెడుతున్నారే కాని ఇప్పటి వరకు వాటిని అందజేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ తీరుతో విసిగి పోయిని రైతులు కూడా వాటిని అడగడమే మానేశారు. భూ సారానికి అనుగుణంగా పోషకాలను పిచికారి చేస్తే కొంతమేర భూమి సారం పెరిగి తద్వారా ఆశాజనకంగా దిగుబడులు ఉండేవని రైతులు చెప్తున్నా పాలకుల్లో చలనంలేదు. ప్రతి ఏటా భూసార పరీక్షలు చేపట్టి ఆ మట్టికి తగ్గట్లు ఏ పోషకాలు అవసరమో గుర్తించి వాటిని రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో నిర్విరామంగా కొనసాగింది. 2014 నుంచి 2019 వరకు సూక్ష్మ పోషకాలను అప్పటి ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందించింది. అలా అందించే పోషకాలలో జింకు, జిప్సం, బోరాన్‌ తదితరాలు ఉండేవి. భూసార పరీక్షలను చేపట్టి అన్నదాతలకు సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కార్డులను అందించి వాటి ద్వారా సాయం చేసేది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 70,000 మంది రైతులు ఈ కార్డు ద్వారా ఉచితంగా పోషకాలను అప్పట్లో అందుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వం కొలువుదీరిన తొలి ఏడాదిలో వాటిని 50 శాతం రాయితీపై రైతులకు అందించింది. ఇక రెండేళ్ల నుంచి వాటి ఊసేలేదు. ప్రతిసారీ వ్యవసాయ శాఖ రైతుల నుంచి ఇండెంట్‌ తీసుకోవడం తప్పితే పంపిణీ చేసిన పాపాన పోలేదు. ఖర్చులు పెరిగి సేద్యం గిట్టుబాటుకావడంలేదు. ఈ పరిస్థితుల్లో సూక్ష్మ పోషకాలకు వెచ్చించే మొత్తం రైతులకు అదనపు భారంగా మారింది. దిగుబడుల కోసం వీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో పది కేజీల జింకు ధర దాదాపు రూ.600 ఉండగా, జిప్సం 50 కేజీల బ్యాగు రూ.1100 వరకు ఉంది. బోరాన్‌ కోసం కిలోకు రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఆయా కంపెనీలను బట్టి వీటి ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసం ఉన్నప్పటికీ రైతులకు భారంగా మారాయి. పోషకాల లోపం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2018లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో హెక్టారు వరికి 6,700 కిలోలు అయితే గత సంవత్సరం 5,100 కిలోలకు ఉత్పాదకత పడిపోయింది. ఈ విధంగా ప్రతి పైరు విషయంలో కూడా తీసికట్టుగానే దిగుబడులు ఉంటున్నాయి. రసాయనాల వాడకం వల్ల భూసారం దెబ్బతింటున్నందు వల్ల ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున వీటి వాడకాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం మొత్తానికే ఈ పథకాన్ని అటకెక్కించింది.

ఇండెంట్లు పెట్టాం..

సీజన్‌ ప్రారంభమైన ప్రతిసారీ వ్యవసాయ శాఖ రైతుల నుంచి ఏ పోషకాలు అవసరమో ఆర్డర్‌ తీసుకుని ఇండెంట్‌ పెడుతుంది. ప్రభుత్వం నుంచి వస్తున్నాయి.. అన్నట్లుగా అధికారులు చెప్తున్నారే కాని అలా వచ్చింది లేదు.. ఇచ్చింది లేదు. ఈ తంతు రెండేళ్లుగా సాగడం తప్ప వాటిని రైతుభరోసా కేంద్రాలలో ఉంచి రైతులకు అందించిన పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో విధిగా భూసార పరీక్షలు జరిపేవారు. ప్రస్తుతం వాటి పరిస్థితి తీసికట్టుగానే మారింది. వాటికి సంబంధించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో వారు మానేశారు. ఆర్థికంగా భరించగలిగే శక్తి ఉన్న అన్నదాతలకు అసలు తమ పొలంలో ఏ పోషకాల లోపం ఉందో తెలిపే యంత్రాంగం కూడా కొరవడింది. మట్టి నమూనాలు తీసుకెళితే ఆర్‌బీకేలలో పరీక్ష చేస్తారనే ప్రభుత్వ మాటలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న దాఖలాలు మచ్చుకైన లేవు. రాబోయే రబీ సీజన్‌కయినా రాయితీపై సూక్ష్మ పోషకాలు అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందని రైతులు అభ్యర్థిస్తున్నారు.

Updated Date - 2022-11-24T00:37:27+05:30 IST