పదిలో.. ఏడో స్థానం

ABN , First Publish Date - 2022-06-07T05:58:34+05:30 IST

ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27 నుంచి జరిగిన పది పరీక్షలకు ఉమ్మడి జిల్లా(గుంటూరు, బాపట్ల, పల్నాడు) నుంచి 59,023 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 40,254 మంది(68.29 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

పదిలో.. ఏడో స్థానం

భారీగా పడిపోయిన ఫలితాలు

18 పాఠశాలల్లో విద్యార్థులంతా పాస్‌

రెండు పాఠశాలలకు సున్నా ఫలితాలు 

ఉమ్మడి జిల్లాలో 68.29 శాతం ఉత్తీర్ణత


గుంటూరు(విద్య), జూన్‌ 6: ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27 నుంచి జరిగిన పది పరీక్షలకు ఉమ్మడి జిల్లా(గుంటూరు, బాపట్ల, పల్నాడు) నుంచి 59,023 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 40,254 మంది(68.29 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో ఈ ఏడాది అత్యధిక మంది విద్యార్థులు ఫెయిల్‌ అయినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఫలితాలు రాలేదని, ఈ ఏడాది భారీగా పడిపోయాయి. విద్యారంగానికి పెట్టింది పేరుగా ఉన్న జిల్లాలో ఈ స్థాయిలో ఫలితాలు పడిపోవడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పది పరీక్షల్లో వచ్చిన నూతన మార్పులు, కొవిడ్‌ కారణంగా  విద్యార్థులకు రెండేళ్ల నుంచి సక్రమంగా పాఠశాలలు జరగక పోవడం తదితర కారణాలతో దాదాపు 18,769 మంది ఫెయిల్‌ అయ్యారు. ఇందులో అత్యధిక మంది ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలతోపాటు ప్రైవేటు స్కూల్స్‌ విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే పది పరీక్షలో మొదటి శ్రేణిలో జిల్లాలో 31,112 మంది ఉత్తీర్ణులుకాగా, ద్వితీయ శ్రేణిలో 6,508 మంది, తృతీయ శ్రేణిలో 2574 మంది ఉత్తీర్ణులయ్యారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు దాదాపు 18 వరకు ఉన్నాయి. మరోవైపు జీరో శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ఉన్నాయి.  చేబ్రోలు మండలంలోని హర్వెస్ట్‌ ఇండియ  ఆశ్రమ పాఠశాల నుంచి 23 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందరూ ఫెయిల్‌ అయ్యారు. గుంటూరులోని రత్నహైస్కూల్‌ స్కూల్‌ నుంచి పరీక్ష రాసిన ఒక్క విద్యార్థి ఫెయిలైనట్లు విద్యాశాఖ విడుదల చేసిన రికార్డులు వెల్లడిస్తున్నాయి.


Updated Date - 2022-06-07T05:58:34+05:30 IST