యువశాస్త్రవేత్త అవార్డుకు ఎంపిక

ABN , First Publish Date - 2022-04-24T06:31:48+05:30 IST

పట్టణానికి చెందిన ఈమని లక్ష్మీసౌమ్యకు బయోకెమిస్ట్రీలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు లభించింది.

యువశాస్త్రవేత్త అవార్డుకు ఎంపిక

పిఠాపురం, ఏప్రిల్‌ 23: పట్టణానికి చెందిన ఈమని లక్ష్మీసౌమ్యకు బయోకెమిస్ట్రీలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు లభించింది. జులైలో పోర్చుగీస్‌ రాజధాని లిస్బిన్‌లో జరిగే అంతర్జాతీయ సమ్మేళనంలో ఆమె ఈ అవార్డు అందుకోనుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన లక్ష్మీసౌమ్య ప్రస్తుతం గుంటూరు కేఎల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తోంది. పీహెచ్‌డీ చేస్తూనే ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ బయో కెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (ఐయూబీఎంబీ), అమెరికాకు చెందిన పాన్‌ అమెరికన్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ బయో కెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(పీఏబీఎంబీ), యూరప్‌ ఖండానికి చెందిన ఫెడరేషన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ బయోకెమిస్ట్రీ సొసైటీస్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన యంగ్‌ సైంటిస్ట్‌ ఫోరమ్‌ పోటీల్లో ఆన్‌లైన్‌లో పాల్గొంది. డీఎన్‌ఏ స్టెబిలిటీ ఇన్‌ నార్మల్‌ అండ్‌ న్యూరో డిజనరేటివ్‌ బ్రెయిన్‌ అనే అంశంపై ఆమె పత్రాన్ని సమర్పించింది. ఆన్‌లైన్‌లో, వర్చువల్‌గా హాజరై ఫోరమ్‌ ప్రతినిధుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమా దానాలు చెప్పడంతో ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు పాల్గొంటున్న వేదికపై 10 నిమిషాల పాటు ప్రజంటేషన్‌ ఇచ్చే అవకాశం లక్ష్మీసౌమ్యకు లభించింది.  తల్లిదండ్రులు వెంకటరమణమూర్తి, నాగమణిల ప్రోత్సాహం, కోనేరు సత్యనారాయణ యూనివర్సిటీ ప్రో చాన్సలర్‌ డాక్టర్‌ కేఎస్‌ జగన్నాథరావు అందించిన సహకారం మరువలేనిదని లక్ష్మీసౌమ్య తెలిపింది. అల్జీమర్స్‌ వ్యాధి కారణాలపై పరిశోధన చేసి పరిష్కారం కనుగొనడం లక్ష్యమని పేర్కొంది.

Updated Date - 2022-04-24T06:31:48+05:30 IST