కొనసాగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2022-07-18T07:10:07+05:30 IST
ఎగువ ప్రాంతంలో వరదనీరు తగ్గుముఖం పట్టడంతో మండలంలో కొంతమేర తగ్గి వరద ఉధృతి కొనసాగుతోంది.
రావులపాలెం రూరల్: ఎగువ ప్రాంతంలో వరదనీరు తగ్గుముఖం పట్టడంతో మండలంలో కొంతమేర తగ్గి వరద ఉధృతి కొనసాగుతోంది. మండలంలోని గౌతమి వశిష్ఠ పాయలనుఆనుకుని ఉన్న పంట పొలాలన్నీ వరదముంపులో చిక్కుకున్నాయి. ప్రధానంగా అరటి, తమలపాకు, కూరగాయలు తదితర ఉద్యానపంటలన్నీ ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో గౌతమీ వశిష్ఠ పాయలో ప్రవాహ నీటిమట్టం కూడా కొంతమేర తగ్గింది.
ఏటిగట్ల పటిష్టతకు చర్యలు
గోదావరికి వరదనీరు ముంచెత్తి ప్రవహిస్తోండడంతో రావులపాలెం మండలంలోని ఏటిగట్ల పటిష్టతకు అధికారులు చర్యలు చేపట్టారు. బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఇసుకమూటలతో ఏటిగట్లను అధికారులు పటిష్టపరిచారు. అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా అధికారులు ఏటిగట్లను పర్యవేక్షిస్తున్నారు.