వేట్లపాలెంలో దొంగలు హల్చల్
ABN , First Publish Date - 2022-09-17T06:08:27+05:30 IST
మండలంలోని వేట్లపాలెంలో రాత్రి వేళల్లో దొంగల భయం ప్రజలను వెన్నాడుతోంది. గురువారం అర్ధరాత్రి భేతాళగుడి వెనుక గల నున్న నారాయణరావు ఇంటిలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో దొంగలు ప్రవేశించారు.
చోరీకి విఫలయత్నం
ఆందోళన చెందుతున్న ప్రజలు
సామర్లకోట, సెప్టెంబరు 16: మండలంలోని వేట్లపాలెంలో రాత్రి వేళల్లో దొంగల భయం ప్రజలను వెన్నాడుతోంది. గురువారం అర్ధరాత్రి భేతాళగుడి వెనుక గల నున్న నారాయణరావు ఇంటిలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో దొంగలు ప్రవేశించారు. ఏమీ అందుబాటులో లేకపోవడంతో కుటుంబసభ్యులు నిద్రిస్తున్న గదులకు బయట తాళాలు వేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా ఆ ఇంటికి ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తెల్లవారుజామున నిద్రలేచిన ఇంటి యజమానులు తమ గదులకు తాళాలువేసి ఉండడాన్ని గుర్తించి సమీపంలో ఉన్న బంధువులకు సమాచారం అందించి బయటకు వచ్చారు. దొంగలకు ఏమీ విలువైన వస్తువులు లభించలేనట్లు గుర్తించారు. సీసీ పుటేజీలను పరిశీలించగా దొంగలు అర్ధరాత్రి 12 గంటల తర్వాత లోనికి ప్రవేశించి అరగంట సేపు సోదాలుచేసి విఫలయత్నం చెందినట్టు గుర్తించారు. సీసీ పుటేజీతో యజమాని నారాయణరావు సామర్లకోట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. గతంలో రాత్రి వేళల్లో చోరీలను అరికట్టేందుకు సామర్లకోట నుంచి పోలీసులను గ్రామానికి పంపి గస్తీ నిర్వహించేవారని, ఇటీవల పోలీసులు రావడం మానేశారని దీంతో దొంగల భయం పట్టుకుందని పలువురు వాపోయారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సత్వరం స్పందించి గ్రామంలో పోలీసు గస్తీ ఏర్పాటుచేసి చోరీలను నిరోధించాలని పలువురు కోరుతున్నారు.