ఘనంగా రాజరాజ నరేంద్రుడి సహస్రాబ్ది ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-09-26T06:02:44+05:30 IST
చరిత్రాత్మక రాజమహేంద్రవరం మహారాజు రాజరాజనరేంద్రుడు కాలంలో తెలుగు భాష పరిఢవిల్లిందని తానా సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు.
రాజమహేంద్రవరంసిటీ, సెప్టెంబరు 25: చరిత్రాత్మక రాజమహేంద్రవరం మహారాజు రాజరాజనరేంద్రుడు కాలంలో తెలుగు భాష పరిఢవిల్లిందని తానా సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అఽధ్యక్షుడు అద్దంకి రాజాయోనా ఆధ్వర్యంలో రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాలు ఆదివారం ఘనం గా నిర్వహించారు. అనంతరం కళలు, సాహిత్య, విద్య, వైద్య రంగాల్లో విశేష కృషి, ప్రతిభ చాటిన ప్రముఖులకు పురస్కారాలు అందించారు. పిఠాపురం సంస్థానం రాజవంశీయులు రాజారావు వెంకట మహిపతి రాజారత్నంరావ్, తుని సంస్థా నం నుంచి రాజా వెంకట సూర్యనారాయణ రాజ బహద్దూర్, రాజా సూర్యవెంకట అప్పలకృష్ణం రాజ బహద్దూర్, శ్రీనాథ కవి వారి పదమూడో తరం వారసులు డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ, భక్తరామదాసు పదో తరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, ఏనుగుల లక్ష్మణ కవి తరం వారసుడు ఏనుగు శివరామప్రసాద్, గిడుగు రామ్మూర్తి పంతులు వారసుడు గిడుగు వెంకట నాగేశ్వరరావు, కవయిత్రి మొల్ల పద్నాల్గోవ తరం వారసుడు శివసంకరయ్య హాజరయ్యారు. వారు చేతులు మీదు పురస్కరాలు అందించారు. వారి పూర్వీకులు తెలుగు భాష కు చేసిన కృషిని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏపి సాహిత్య అకాడమి చైర్పర్సన్ పిళ్ళంగోళ్ళ లక్ష్మి, ఏపి దృశ్యకళ అకాడమీ చైర్పర్సన్ కుడిపూడి సత్యశైలజ, శ్రీశ్రీ కళావేధిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, చిలుకూరి శ్రీనివాసరావు, కుడిపూడి పార్థసారఽథి, డాక్టర్ గూటం స్వామి, చెరుకువాడ రంగసాయి, కొల్లి రమావతి, బివివి సత్యనారాయణ, డాక్టర్ కొండేటి రాజన్ బాబు, తురగా సూర్యనారాయణ పాల్గొన్నారు.