హత్యకేసులో బెయిల్‌పై వచ్చి.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-02-19T05:45:03+05:30 IST

రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం..

హత్యకేసులో బెయిల్‌పై వచ్చి.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

  రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 18: రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరుకు చెందిని మేరి విలియమ్స్‌ తన తమ్ముడితో కలిసి బైక్‌ పై రాజమహేంద్రవరం వచ్చి తిరిగి వెళ్తుండగా మోరంపూడి సెంటర్‌లో రెడ్‌సిగ్నల్‌ పడింది. దీంతో వీరి బైక్‌ను ఒక లారీ పక్కగా ఆపారు. అయితే వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ పడడంతో లారీ వేగంగా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో లారీ వెనుక భాగం వీరి బైక్‌ హ్యాండిల్‌కు తగలడంతో మేరి, ఆమె తమ్ముడు లారీ వెనుక చక్రం  కిందపడిపోయారు. దీనిని గమనించని లారీ డ్రైవర్‌ వేగంగా వెళ్లడంతో మేరి లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె తమ్ముడు స్వల్పంగా గాయపడ్డాడు. కాగా మేరి, ఆమె భర్త జనవరిలో ఓ హత్యకేసులో జైలుకు వెళ్లారు. ఇటీవల ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ రావడంతో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రకాష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె శుక్రవారం సంతకం చేసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆమె మృతిచెందింది. తల్లి మృతి, తండ్రి జైలులో ఉండడంతో పిల్లలు దిక్కులేని వారుగా మిగిలారు. పోలీసులు మేరి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

 

Updated Date - 2022-02-19T05:45:03+05:30 IST