చీపురుగూడెం పోస్టాఫీసులో నిధుల స్వాహా

ABN , First Publish Date - 2022-12-13T01:11:44+05:30 IST

తూర్పుగోదావరిజిల్లా నల్లజర్ల మండలంలోని చీపురుగూడెంలో పోస్టాఫీసులో భారీ స్కాం బయటపడింది.

చీపురుగూడెం పోస్టాఫీసులో నిధుల స్వాహా

రూ.23 లక్షల వరకు అవకతవకలు

పోస్టాఫీసుకు తాళాలు వేసి బాధితుల ధర్నా

నల్లజర్ల, డిసెంబరు 12: తూర్పుగోదావరిజిల్లా నల్లజర్ల మండలంలోని చీపురుగూడెంలో పోస్టాఫీసులో భారీ స్కాం బయటపడింది. 70మంది లబ్ధిదారుల నుంచి సుమారు రూ.23 లక్షల వరకు నగదు తేడాలున్నట్టు వాపోతున్నారు. దీనికి నిరసనగా సోమవారం చీపురుగూడెం పోస్టాఫీసు వద్ద మహిళలు, గ్రామస్థులు ధర్నా చేసి పోస్టాఫీసుకి తాళాలు వేశారు. తపాలా శాఖను నమ్మి తమకు వచ్చే పింఛన్‌ సొమ్ముల్లో సగం దాచుకున్నామని, తమ ఖాతా పుస్తకాల్లో తపాలా ముద్రవేసి లెడ్జర్‌లో మాత్రం సొమ్ములు కట్టడం లేదని పేర్కొన్నారు. నవంబరులో తనిఖీ అధికారులు పోస్టాఫీసుకు వచ్చారు. ఆ సమయంలో పోస్టుమాస్టరు ఇందిరా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పాస్‌బుక్స్‌ తీసుకుంది. ఆ తర్వాత నుంచి గ్రామంలో కనిపించకుండాపోయింది. 70మంది పాస్‌బుక్స్‌ తీసుకుని వెళ్లిపోవడంతో తమకు ఆధారం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు పాస్‌బుక్స్‌ ఇప్పించాలని తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా తీసుకున్న సొమ్ములను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చెల్లు కృష్ణమూర్తి, పల్లగాని కృష్ణకుమారి, గాలింకి విజయలక్ష్మి, చంద్రలీలా, గాలింకి మమత, చెల్లు పుల్లారావు, కొరపాటి కళావతి, కలగర చిన్నవెంకట్రావు, తలంశెట్టి రామయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:11:46+05:30 IST