ప్రశాంతంగా పాలిసెట్
ABN , First Publish Date - 2022-05-30T06:41:57+05:30 IST
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్-2022 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా సమన్వయకర్త ఎన్.జనార్ధనరావు తెలిపారు.
కాకినాడ రూరల్, మే 29: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్-2022 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా సమన్వయకర్త ఎన్.జనార్ధనరావు తెలిపారు. ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి నెలకొంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 8,837 మందికి గాను 27 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. 8,543 మంది విద్యార్థులు హాజరు కాగా 294 మంది పరీక్ష రాయలేదు. పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా విద్యార్థులు చేరుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ ఆఖరి నిమిషం వరకూ పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా కాకినాడ ఏపీటీలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా సమన్వయకర్త ఎన్.జనార్ధనరావు పరిశీలించారు. మొత్తం 96.67 శాతం హాజరు నమోదైందని తెలిపారు. పరీక్షను పక్కాగా నిర్వ హించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లోను, ఎగ్జామ్ హాల్ లోను అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. సిబ్బంది సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు.