పరంపర-2తో చేతులు మారుతున్న లక్షలు
ABN , First Publish Date - 2022-11-25T00:54:53+05:30 IST
పేపర్మిల్లులో పరంపర - 2పేరుతో చేపడుతున్న ఉద్యోగాల భర్తీ విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని పేపర్మిల్లు పర్మినెంట్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు.
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 24 : పేపర్మిల్లులో పరంపర - 2పేరుతో చేపడుతున్న ఉద్యోగాల భర్తీ విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని పేపర్మిల్లు పర్మినెంట్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఆరోపించారు. పేపర్మిల్లు ఎదురుగా ఉన్న సీఐటీయూ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. మిల్లు యాజమాన్యం గుర్తింపు సంఘం నాయకుడిగా చెప్పుకుంటున్న వ్యక్తితో కుమ్మక్కయి కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. పోస్టుల భర్తీ కార్మిక చట్టాలకు లోబడే జరగాల్సి ఉందన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి 2019లోనే ముగిసిపోయిందని, తిరిగి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు డీసీఎల్ ఆ ప్రక్రియను ప్రారంభించారన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, నాయకులు వెంకటేశ్వరరావు, ఐఎన్టీయూసీ నాయకులు దాస్, ఎస్డబ్ల్యుడబ్ల్యుఏ నాయకులు కస్సే రాజేష్, లంక అప్పారావు, టీఎన్టీయూసీ నాయకులు సుబ్బారావు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.