నన్నయను గోదావరి జిల్లాల క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2022-12-10T00:43:19+05:30 IST
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని గోదావరి జిల్లాల క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలని ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు
దివాన్చెరువు, డిసెంబరు 9: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని గోదావరి జిల్లాల క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలని ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్స హించాలన్నారు. నన్నయ వర్శిటీలో శుక్రవారం క్రీడా బోర్డు వార్షిక సమావేశంను నిర్వహించారు. గత విద్యాసంవత్సరంలో జాతీయస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరచిన వారిని ఈ సమావేశంలో అభినందించారు. ఏడాదికాలంలో వర్శిటీ పరిధిలో జరిగిన క్రీడా కార్యక్ర మాలు, అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అర్హత, ప్రతిభ ఉన్నవారికే అవకాశాలను కల్పించాలన్నారు. తర్వాత క్రీడా బడ్జెట్, విధి విధానాలను, వార్షిక అజెండాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ప్రిన్సిపాల్స్ కె.సుబ్బా రావు, కె.రమణేశ్వరి, ఏయూ వ్యాయామ ఆచార్యులు విజయమోహన్, సూర్య నారాయణ, డిగ్రీ కాలేజీ అకడమిక్ డైరెక్టర్ హబీబ్భాషా, క్రీడాబోర్డు కార్యదర్శి బి.రామ్గోపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు.
పైజోమీటర్లతో భూగర్భ జలాల అంచనా
పైజోమీటర్ల ద్వారా నన్నయ విశ్వవిద్యాలయం, చుట్టుప్రక్కల గ్రామాల్లో భూగర్భ జలాలను అంచనా వేయవచ్చని వీసీ మొక్కా జగన్నాథరావు అన్నారు. జిల్లా భూగర్భ జలవిభాగం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద భూగర్భ జలాలను అంచనా వేసేందుకు నన్నయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు పైజో మీటర్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంత రం మాట్లాడుతూ జియోసైన్సెస్ విద్యార్థులు పైజోమీటర్ల పనితీరు, భూగర్భ జలాల అంచనాపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ వై.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ కె.రమణేశ్వరి, కన్వీనర్ కె.నూకరత్నం, అధ్యాపకుడు కేవీ స్వామి పాల్గొన్నారు.