ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

ABN , First Publish Date - 2022-01-23T05:58:38+05:30 IST

గత ప్రభుత్వాలు పేదవారి గృహాలకు ఇచ్చిన రుణాలను ఓటీఎస్‌ పేరుతో వసూలు చేయమని అధికారులపై ఒత్తిడి చేయడం సరికాదని సూచిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

కిర్లంపూడి, జనవరి 22: గత ప్రభుత్వాలు పేదవారి గృహాలకు ఇచ్చిన రుణాలను ఓటీఎస్‌ పేరుతో వసూలు చేయమని అధికారులపై ఒత్తిడి చేయడం సరికాదని సూచిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.  కిర్లంపూడిలో ఆయన స్వగృహం నుంచి ముఖ్యమంత్రికి లేఖను విడుదల చేశారు.  గత ప్రభుత్వాలు నిరుపేదల గృహాలకు ఇచ్చిన రుణాలకు ఓటీఎస్‌ పేరుతో డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేయడం న్యాయం కాదన్నారు.  గత ప్రభుత్వంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు వివిధ శాఖల పర్యవేక్షణలో పలు అభివృద్ధి పనులు చేశారని,  గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం న్యాయమేనంటారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఎంతో మంది  ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకూడదని మీరు భావించినప్పుడు గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల ముందు ఇచ్చిన ఇంటి రుణాలు వసూలు చేసే అధికారం కూడా మీకు లేనట్టేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వారిని చాలా ఇబ్బందులకు గురిచేయడం మంచిగా లేదన్నారు. కొట్టొద్దని కోరితే మరొకటి కొట్టు అన్నట్టుగా ఉంది మీ నిర్ణయం అని చెప్పుకుంటున్నారన్నారు. దయచేసి ఈ విషయాలపై సానుభూతి చూపాలని ముఖ్యమంత్రిని ఆ లేఖలో ముద్రగడ కోరారు.

Updated Date - 2022-01-23T05:58:38+05:30 IST