గాంధీ జీవితమే ఒక పాఠ్యాంశం
ABN , First Publish Date - 2022-09-25T06:43:40+05:30 IST
వైద్య విద్యార్ధులు సేవకు ప్రతి రూపంగా నిలవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు.
మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
రాజానగరం/సీతానగరం, సెప్టెంబరు 24 : వైద్య విద్యార్ధులు సేవకు ప్రతి రూపంగా నిలవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో గాంధీ కింగ్ ఫౌండేషన్, బేర్లిన్, జర్మనీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.గాంధీజీ అహింసా మార్గం ప్రపంచానికి ఆదర్శంగా నిలపడంపై యువత స్ఫూర్తి పొందాలన్నారు. ఆధునిక సమాజంలో మహాత్మాగాంధీ జీవితమే ఒక పాఠ్యాంశమని, నేటి యువత చదువుతో పాటు ఆయన సూత్రాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.గాంధీ ఇన్ఫర్మేషన్ సెంటర్ (జర్మనీ) ప్రెసిడెంట్ డాక్టర్ క్రిస్టియన్ బర్తోల్స్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైనదని.. సమాజంలో సేవా దృక్ఫ థంతో ముందు తరాల వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం సీతానగరంలోని చారిత్రాత్మక కస్తూర్భాగాంధీ ఆశ్రమాన్ని బర్తోల్స్ సందర్శించారు. మహాత్మగాంధీ నడయాడిన ఆశ్రమాన్ని సందర్శించడం తన పూర్వ జన్మ శుక్రుతంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జీఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.శర్మ, డాక్టర్ వి.గురునాఽథ్, డాక్టర్ టీవీఎస్పీ మూర్తి, వైద్య విద్యార్థులు,గాంధీ ఆశ్రమ నిర్వాహకురాలు సుశీల పాల్గొన్నారు.