హైవేతో చితికిన బతుకులు
ABN , First Publish Date - 2022-04-24T06:15:41+05:30 IST
గుండుగోలను-కొవ్వూరు వరకు నిర్మించిన నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం వల్ల అనేక మంది వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగింది. గ్రామాలకు సంబంధం లేకుండా హైవే రోడ్డు నిర్మాణం జరగడంతో వాహనాలు సంబంధిత గ్రామాల్లోకి రాకుండానే వెళ్లిపోతున్నాయి.
- చతికిలపడ్డ పాన్షాపులు, జ్యూస్ సెంటర్లు, హోటళ్లు
- జీవనాధారం కోల్పోయిన వ్యాపారులు
నల్లజర్ల, ఏప్రిల్ 23: గుండుగోలను-కొవ్వూరు వరకు నిర్మించిన నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం వల్ల అనేక మంది వ్యాపారులకు తీవ్ర నష్టం కలిగింది. గ్రామాలకు సంబంధం లేకుండా హైవే రోడ్డు నిర్మాణం జరగడంతో వాహనాలు సంబంధిత గ్రామాల్లోకి రాకుండానే వెళ్లిపోతున్నాయి. దీంతో భోజన హోటళ్లు, పెట్రోల్ బంకులు, పాన్షాపులు, కిరాణా, జ్యూస్, టీ, టిఫిన్ హోటళ్ల వ్యాపారులు జీవనాధారం కోల్పోయారు. మండల కేంద్రమైన నల్లజర్ల అన్ని వ్యాపారాలకు నిలయంగా ఉండేది. ప్రస్తుతం హైవే రాకతో నల్లజర్ల రూపరేఖలు మారిపోయాయి. జీవనాధారం లేక వ్యాపారులు అద్దెలు కట్టలేక షాపులను ఖాళీ చేస్తున్నారు. అనంతపల్లిలో పేరొందిన హోటల్స్ సైతం కస్టమర్లు రాక వెలవెలబోతున్నాయి. జాతీయ రహదారి నిర్మాణం వల్ల భీమడోలు, దూబచర్ల, నల్లజర్ల, అనంతపల్లి, యర్నగూడెం, దేవరపల్లి, పంగిడిగూడెం వంటి మేజర్ పంచాయతీ గ్రామాల్లో వ్యాపారులకు తీరని నష్టం ఏర్పడింది. రియల్ఎస్టేట్ రంగం సైతం చతికిలపడింది.