ప్రభుత్వం.. లెక్క తప్పింది!
ABN , First Publish Date - 2022-05-18T07:09:27+05:30 IST
బొండాల వడ్ల రకాలకు భలే గిరాకీ పెరిగింది. గతంలో బొండాలంటే ఎవరూ కొనేవారుకాదు. చౌకబియ్యం కిందనో, రవ్వ ఆడడా నికో ఎక్కువ ఉపయోగించేవారు. కొనేవాడులేక బొండాలు పం డించిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతుండేవారు.
బొండాల వడ్లకు గిరాకీ
దర కూడా అదిరింది..
సన్న రకాలకు తగ్గింది..
బొండాలు ఊడ్చవద్దని హెచ్చరించిన ప్రభుత్వం
బొండాల రకం వేస్తే కొనేదిలేదన్నట్టు ప్రచారం
కానీ కేరళలో డిమాండ్తో పెరిగిన బొండాలు ధర
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
బొండాల వడ్ల రకాలకు భలే గిరాకీ పెరిగింది. గతంలో బొండాలంటే ఎవరూ కొనేవారుకాదు. చౌకబియ్యం కిందనో, రవ్వ ఆడడా నికో ఎక్కువ ఉపయోగించేవారు. కొనేవాడులేక బొండాలు పం డించిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతుండేవారు. ఈనేపథ్యంలో గతేడాది వైసీపీ ప్రభుత్వం రైతులెవరూ బొండాల పంట సాగుచేయవద్దని హెచ్చరించింది. ఒకవేళ వేసినా ఆ రకం ధాన్యం కొనేది లేదన్నట్టు కూడా వ్యవసాయాఽధికారులతో ప్రచారం సాగించింది. అయినా కొంతమంది బొండాలే సాగుచేశారు. కానీ అనూహ్యంగా బొండాల రకం ధాన్యానికి డిమాండ్ పెరిగింది. కేరళలో ఎక్కువగా ఈ రకం ధాన్యం వాడతారు. అక్కడకు ఎగుమతులు ఎక్కువ ఉం టాయి. దీంతో మిల్లర్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అందరూ ఇష్టపడే సన్నాలు ఆదరణ కోల్పోయాయి. ధర ఎక్కువ లేదు. మన ప్రాంతంలో ఎక్కువగా ఈసారి స్వర్ణ వంటి ఏగ్రేడ్ రకాలైన సన్నాలే పండించారు. కానీ ఇవాళ సన్నాలకంటే బొండాలకే ధర ఉండడంతో పరిస్థితులు మారాయి. నిజంగా ఈ పరిస్థితి ఉందా, ధాన్యం కొనుగోలుదారులు ఎక్కువగా పండించిన సన్నాలను తక్కువ ధరకు కొనాలనే ఎత్తుగడతో తక్కువగా పండిన బొండాల ధర పెంచారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవాళ 75 కేజీల సన్నరకం ధాన్యం ధర రూ.1300వరకూ ఉంటే, బొండాల ధర రూ.1500 వరకూ ఉంది. కోనసీమ జిల్లాలో 5 వేల ఎకరాల వరకూ బొండాలు పండించగా, కాకినాడ జిల్లాలో కొంత, తూర్పుగోదావరిలో సీతానగరం, కోరుకొండ మండలాల్లో ఎక్కువగా పండించారు. కానీ ఇప్పటికే మొత్తం అమ్మేసుకున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం జరిగిన మూడు జిల్లాల సమీక్షలో అధికార్లను ఆరా తీశారు. ఇటీవల గణపవరంలో సీఎం వద్దకు వచ్చిన కొందరు మిల్లర్లు బొండాల ధాన్యాన్ని మద్దతు ధర కంటే రూ.50కి ఎక్కువ కొంటున్నామని చెప్పారని ఆయన చెప్పడం గమనార్హం.