డొంకరాయిలో పవర్ కెనాల్ మరమ్మతు పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-30T06:22:03+05:30 IST
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి వవర్ కెనాల్ మరమ్మతు పనులను ఆదివారం ప్రారంభించారు.
మోతుగూడెం, మే 29: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి వవర్ కెనాల్ మరమ్మతు పనులను ఆదివారం ప్రారంభించారు. పవర్ కెనాల్ పనులు ప్రారంభం సందర్భంగా రీచ్1, రీచ్ 2ల్లో ఓఆర్ఎం సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జెన్కో చీఫ్ ఇంజనీర్ రాంబాబు మాట్లాడుతూ పవర్కెనాల్ మరమ్మతులకు శనివారం అర్ధరాత్రి నుంచి ఎల్సీ అనుమతులు మంజూరైనప్పటికీ ఆదివారం ఉదయం వరకు పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వచ్చిందన్నారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి కెనాల్కు నీటి విడుదలను నిలిపివేశామన్నారు. కెనాల్లో కొద్దిపాటి నీటి నిల్వలు ఉండటంతో ఆ నీటిని ఏవీపీ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు వదిలి కెనాల్లో నీటిని తగ్గించే చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పవర్ కెనాల్ పనులకు రూ.80లక్షల నుంచి కోటివరకు వెచ్చిస్తున్నా మన్నారు. కెనాల్ అత్యవసర పనులు కారణంగా 20 రోజులు పాటు డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో 485 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోతుందన్నారు. కాంప్లెక్సు పరిధిలో ఒక్క సీలేరులోనే విద్యుత్ ఉత్పత్తి యఽథావిధిగా కొనసాగుతుందన్నారు. కెనాల్ పనులను యుద్ధప్రాతి పదికన పూర్తిచేయడానికి సీలేరు కాంప్లెక్సు పరిధిలోని ఇంజనీర్లను, సిబ్బందిని, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేశామన్నారు.. డొంకరాయి నుంచి ఫోర్బే వరకు గత 16 కిలోమీర్ల పవర్ కెనాల్కు గ్రౌటింగ్, కెనాల్ సైడ్ వాల్స్ మరమ్మతులు, కెనాల్ అడుగు భాగంలో గోతులు వంటి పనులు పూ డ్చడం వంటి పనులను నిర్వహిస్తామన్నారు. జెన్కో ఉన్నతాధికార్లు ఇచ్చిన గడువు కన్నా రెండు రోజులు ముందుగానే పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం ఏపీ జెన్కో విద్యుత్ సౌదా విజయవాడ నుంచి కూడా నిపుణుల బృందం కూడా రానున్న దని ఏపీ జెన్కో ఛీఫ్ ఇంజనీర్ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్(సివిల్)కేకేవీ ప్రశాంత్కుమార్, ఈఈలు బాలకృష్ణ, బాబురావు, పాపారావు, శివశంకర్(డీఈటీ), సీనియర్ అకౌంట్ ఆఫీసర్ వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.