మైసూర్ తర్వాత రాజమహేంద్రవరంలోనే..
ABN , First Publish Date - 2022-09-26T05:58:36+05:30 IST
రాజమహేంద్రవరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.
ముస్తాబైన దేవీచౌక్
నేడు స్వర్ణకవచ అలంకరణ
దసరా ఉత్సవాలు ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 25: రాజమహేంద్రవరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి 9:45 గంటలకు దేవిచౌక్లో అమ్మవారి విగ్రహప్రతిష్ఠానన జరిగింది. దేవిచౌక్లో 89వ దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. దేవాలయ శిఖరాలను పందిరిపైకి తెచ్చారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. సోమవారం అమ్మవారు స్వర్ణకవచ అలంకరణలో భక్తులకు దర్శన మిస్తారు.. దేశంలో మైసూర్ తర్వాత రాజమహేంద్రవరంలోనే ఘనంగా జరగడం విశేషం. ఈ నెల 26న ఉదయం 9:08 గంటలకు కలశస్థాపన , ప్రతి రోజు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 8గంటల వరకు కుంకు పూజలు చేస్తారు. అమ్మవారు 26న స్వర్ణకవచ అలంకరణ, 27న గాయిత్రిదేవి, 28న అన్నపూర్ణదేవి, 29న మహాలక్ష్మిదేవి, 30న బాలాత్రిపుర సుందరి దేవి, వచ్చేనెల 1న లలితాదేవి , 2న సరస్వతి దేవి, 3న దుర్గాదేవి, 4న మహిషసురమర్దని, 5న రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శన మిస్తారు.