కస్తూర్బా గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-16T07:27:14+05:30 IST

చారిత్రాత్మక కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

కస్తూర్బా గాంధీ ఆశ్రమ అభివృద్ధికి కృషి: కలెక్టర్‌

సీతానగరం, ఆగస్టు 15: చారిత్రాత్మక కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదిక అమృత్‌ మహోత్సవంలో భాగంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఇందులో భాగంగా కొత్తగా ఏర్పడిన తూర్పు గోదావరి  జిల్లాలో ఉన్న కస్తూర్భా గాంధీ ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు చేపడతామన్నారు. ఆశ్రమంలో మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయని ఆదాయ వనరులను సమకూర్చుకునే విధంగా ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 100మంది మహిళలలు నివసించేందుకు ఈ ఆశ్రమం అనుకూలంగా ఉందని వారికి ఏ విధమైన ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేయాలో అలోచించి ఆయా శాఖలను ఈ ఆశ్రమానికి అనుసంధానం చేస్తామన్నారు. మహాత్మాగాంధీ రెండు సార్లు ఈ వచ్చిన ఈ స్థలాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా మహాత్మాగాంధీ, కస్తూర్బాగాంధీ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం బాపూ కుటీరాన్ని సందర్శించారు. బులుసు వెంకట సత్యనారాయణమూర్తి రాసిన గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీనియర్‌ సిటిజన్స్‌ అయిన కె.చిట్టమ్మ, డేగాల సూర్యారావు, మట్ట సత్యంలను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, బులుసు వెంకట సత్యనారాయణమూర్తి, సబ్‌ కలెక్టర్‌ చైత్ర వర్షిణి, బొంగు రాజారావు, పెందుర్తి నాగరత్నం, తహశీల్దార్‌ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. కాగా కార్యక్రమానికి ముందుగా వచ్చిన ఆర్డీవో చైత్ర వర్షిణి బాల బడి పిల్లల వద్దకు వెళ్లి వారితో ఆడిపాడారు.

Updated Date - 2022-08-16T07:27:14+05:30 IST