కార్పొరేషన్‌ ఎన్నికలకు టీడీపీ సమన్వయ కమిటీ

ABN , First Publish Date - 2022-02-16T06:01:04+05:30 IST

‘రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం ఉన్నత స్థాయిలో ఓ సమన్వయ కమిటీని అధిష్టానం నిర్మించనుంది.

కార్పొరేషన్‌ ఎన్నికలకు టీడీపీ సమన్వయ కమిటీ
సమావేశంలో మాట్లాడుతున్న గోరంట్ల

  • పనిచేసే వారికే పదవులు.. బలహీనంగా ఉంటే మార్చేస్తాం
  • పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ‘రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం ఉన్నత స్థాయిలో ఓ సమన్వయ కమిటీని అధిష్టానం నిర్మించనుంది. కార్పొరేషన్‌ను ఈసారి కూడా దక్కించుకుంటాం.  ఎవరు సమర్థులు, ఎవరైతే గెలవగలమో అని ఆలోచించి, ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది ఈ సమన్వయ కమిటీ నిర్ణయిస్తుంది’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టంచేశారు. తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందే విలీనమైన గ్రామాలతో కలుపుకుని గ్రేటర్‌ రాజమహేంద్రవరం కమిటీని నియమించనున్నామని, అన్నివర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు. తమ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారని, అన్నిచోట్ల కమిటీల పునర్నిర్మాణం జరుగుతోందని అన్నారు. విభాగాల వారీ కమిటీలు ఉంటాయని, ప్రతీరోజూ చంద్రబాబు నియోజకవర్గాల వారీ లోతుగా సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఇన్‌చార్జిలను కూడా బలోపేతం చేయనున్నారని, బలహీనంగా ఉన్నవారిని మార్చేస్తారని చెప్పారు. పని చేసే వారికే పదవులు ఉంటాయని, యువత, నిబద్ధతతో పనిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు. సమావేశంలో  పార్టీ నేతలు మార్ని వాసు, మత్స్యేటి ప్రసాద్‌, శీలం గోవింద్‌, లీగల్‌ సెల్‌ నాయకుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-16T06:01:04+05:30 IST