ఇలాగైతే.. చదువెలా వస్తోంది

ABN , First Publish Date - 2022-10-26T00:14:32+05:30 IST

కళాశాల ఇలా ఉంటే.. విద్యార్థులకు చదువెలా వస్తుందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాగైతే.. చదువెలా వస్తోంది
తరగతి గదుల నిర్వహణపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

కోరుకొండ, అక్టోబరు 25 : కళాశాల ఇలా ఉంటే.. విద్యార్థులకు చదువెలా వస్తుందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుకొండ రాజబాబు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంగళవారం ఆకస్మికంగా పరిశీ లించారు. కళాశాల తరగతి గదులు బూజులు పట్టి ఉండడం, దుమ్ముధూళితో ఎలక్ట్రికల్‌ వైర్లు వేలాడడం గమనించారు. ఇది అసలు తరగతి గదేనా అని ప్రశ్నించారు. తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచవద్దా అని ప్రిన్సిపాల్‌ శారదను, అధ్యాపకులపై మండిపడ్డారు. అనంతరం కళాశాలలో రూ.62 లక్షలతో చేపడు తున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండాలన్నారు. కళాశాల ఆటస్థలం ఆవరణ నీరు నిల్వ ఉండకుండా మెరక చేయాలన్నారు. కళాశాల పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, పనులు నాణ్యతతో జరిగేలా పరిరక్షణ చేయాలన్నారు.అనంతరం ఆమె కళాశాల విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో తరగతి గదులు, మరుగుదొడ్లను, ఆటస్థలాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలన్నారు. ఆమె వెంట జిల్లా ఓకేషనల్‌ విద్య అధికారి డీవీ సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్‌ ఐ.శారద,ఎంఈవో టి.కుశలవ దొర, ఎంపీడీవో నరేష్‌ కుమార్‌, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-10-26T00:14:37+05:30 IST