రిలాక్స్‌ కావొద్దు

ABN , First Publish Date - 2022-10-14T08:07:24+05:30 IST

‘సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18-19 నెలల సమయం ఉంది.

రిలాక్స్‌ కావొద్దు

  • ఎన్నికలకు ఇంకా 18 నెలలున్నా..
  • ఈ క్షణం నుంచే సిద్ధమవ్వండి: జగన్‌
  • ఆలూరు నేతలు, కార్యకర్తలతో భేటీ

అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18-19 నెలల సమయం ఉంది. కానీ ఈ క్షణం నుంచే అందుకు సిద్ధం కండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వైసీపీ కార్యకర్తలను ఆదేశించారు. గురువారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి గుమ్మనూరు జయరాం నేతృత్వంలో వీరంతా వచ్చారు. జగన్‌ తన సహజశైలికి భిన్నంగా వారితో కలివిడిగా, విడివిడిగా మాట్లాడారు. ప్రతి కార్యకర్త నుంచీ నియోజకవర్గ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. మంత్రి జయరాం పనితీరుపై ఆరా తీశారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ బాగా జరుగుతోంది. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన ప్రతి మంచి కార్యక్రమాన్నీ ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం. మనమంతా ఒక్కటైతేనే విజయం సాధిస్తాం. ప్రతి గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తున్నాం. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల కింద గత మూడేళ్లలో రూ.1,050 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు అందజేశాం. ఈ విషయాలు ప్రజలకు చేరవేయండి’ అని సీఎం సూచించారు.


గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను సీఎం జగన్‌ సతీసమేతంగా కలిశారు. ముఖ్యమంత్రి దంపతులకు రాజ్‌భవన్‌ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్‌ స్వాగతం పలికారు. అనంతరం అరగంటకు పైగా గవర్నర్‌, సీఎం ఏకాంతంగా చర్చించుకున్నారు. 


Updated Date - 2022-10-14T08:07:24+05:30 IST