sharannavaratri celebrations: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవిశరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-26T13:31:17+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై వెలసిన కనకదుర్గమ్మ (Kanakadurgamma temple) వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు (Devi Sharannavaratri celebrations) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి స్వర్ణకవచలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరిచారు. స్వర్ణ కవచంతో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కలిగిన మోముతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. సింహవాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. ఈ తల్లి సకల శత్రుబాధలనూ నివారిస్తుంది. ఆకర్షణ శక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే సకల విజయాలూ లభిస్తాయి. స్వర్ణ కవచం మంత్ర బీజాక్షర సమన్వితమై ఉంటుంది. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఆరాధన వల్ల మంత్రశక్తి సిద్ధిస్తుంది.
ఈ రోజు అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పచ్చని పూలతో పూజించాలి. దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం పారాయణం చేయాలి. స్వర్ణకవచాలంకృత అమ్మవారికి బంగారపు రంగు చీర గట్టి, కట్టె పొంగలి, చలిమిడి వడపప్పును, పాయసమును నైవేద్యంగా సమర్పిస్తారు. తొలి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం 9 గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయం ఘాట్రోడ్డు కింద ఉన్నటువంటి అమ్మవారి ఆలయం వద్ద ఆలయ అర్చకులు భవాని మాలలు వేస్తున్నారు. జై దుర్గ జై జై దుర్గ అంటూ అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.