కరెంటు కోతలని రాస్తే పరువు నష్టం కేసు
ABN , First Publish Date - 2022-02-23T08:16:10+05:30 IST
రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని పత్రికల్లో రాస్తే పరువు నష్టం కేసు వేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ను నిరంతరాయంగా అందిస్తున్నామని..
- పత్రికలకు ఇంధన కార్యదర్శి హెచ్చరిక
- నిరంతరాయంగా విద్యుత్ సరఫరా..
- సాగుకు 9 గంటలిస్తున్నామని వెల్లడి
అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయని పత్రికల్లో రాస్తే పరువు నష్టం కేసు వేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ను నిరంతరాయంగా అందిస్తున్నామని.. వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు ఇస్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయినా కరెంటు కోతలు అమలవుతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’, మరో పత్రిక ప్రచురిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పలుమార్లు విలేకరుల సమావేశంలో వివరించినా.. పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేసినా .. ప్రజల్లో అపోహలు రేకెత్తించే విధంగా కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ వినియోగదారుల్లో గందరగోళం సృష్టించడంతో పాటు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇకపై విద్యుత్ కోతలం టూ పత్రికల్లోరాస్తే పరువు నష్టందావా వేస్తామన్నారు.