Mahapadayatra: 12వ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-23T15:20:27+05:30 IST
అమరావతి రైతుల మహాపాదయాత్ర 12వ రోజుకు చేరింది. ఈరోజు మచిలీపట్నం నుంచి కౌతవరం వరకు ర్యాలీ కొనసాగనుంది.
విజయవాడ: అమరావతి రైతుల (Amaravati farmers) మహాపాదయాత్ర (Mahapadayatra) 12వ రోజుకు చేరింది. ఈరోజు మచిలీపట్నం నుంచి కౌతవరం వరకు ర్యాలీ కొనసాగనుంది. యాత్రలో పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు దారిపొడువునా రైతులు, ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై దాడి జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు (Gadde Tirupati Rao) మాట్లాడుతూ... జగన్ (YS Jagan mohan reddy) రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పరాన్న జీవులుగా మంత్రులు... జగన్ ఏం చెప్పినా తానా అంటున్నారన్నారు. ఉమ్మారెడ్టి నాడు మ్యానిఫెస్టోలో కూడా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్(AP CM) మాట తప్పి మోసం చేస్తే... అడగలేక పోతున్నారని అన్నారు. పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో పాదయాత్రపై దాడికి కుట్ర చేశారనే సమాచారం ఉందని... తమకు సంఘీభావంగా వచ్చే స్థానిక ప్రజలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమకు ఏ ప్రమాదం జరిగినా జగన్ దే బాధ్యత అని అన్నారు. డీజీపీ స్పందించి తమకు తగిన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి(YCP Chief) మాట తప్పి మోసం చేసింది వాస్తవమన్నారు. న్యాయం కోరితే తమను దూషిస్తున్నారని అన్నారు. అమరావతి ఆడవాళ్లను తిట్టే నాయకుల ఇళ్ళల్లో అమ్మ, ఆలి, చెల్లి ఉంటారనేది గుర్తు పెట్టుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా చంపానని జగన్ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. రాష్ట్రాన్నే నాశనం చేశారని ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. తప్పకుండా ప్రజలు తగిన సమయంలో వాళ్లకు బుద్ధి చెబుతారని గద్దె తిరుపతిరావు(Amaravati JAC Co Convenor) హెచ్చరించారు.