CM Jagan: ముఖ్యమంత్రా.. మజాకా.. జన సమీకరణకు 700 బస్సులు
ABN , First Publish Date - 2022-11-20T20:52:26+05:30 IST
సీఎం జగన్ (CM Jagan) సోమవారం పర్యటన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narsapur) ఖాకీవనంగా మారింది. భారీ బందోబస్తు మధ్య పట్టణం నిర్బంధంలోకి వెళ్లింది. బందోబస్తు కోసం జిల్లా నుంచే కాకుండా కృష్ణా, తూర్పు జిల్లాల నుంచి కూడా దాదాపు 2వేల మంది పోలీసుల్ని రప్పించారు.
నరసాపురం: సీఎం జగన్ (CM Jagan) సోమవారం పర్యటన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narsapur) ఖాకీవనంగా మారింది. భారీ బందోబస్తు మధ్య పట్టణం నిర్బంధంలోకి వెళ్లింది. బందోబస్తు కోసం జిల్లా నుంచే కాకుండా కృష్ణా, తూర్పు జిల్లాల నుంచి కూడా దాదాపు 2వేల మంది పోలీసుల్ని రప్పించారు. ఇక సీఎం దిగే హెలీప్యాడ్ నుంచి సభ వేదిక వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లను కట్టారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో జనం రోడ్డు మీదకు రాకుండా కొన్ని చోట్ల క్లాత్లతో మూసివేస్తున్నారు. ఆదివారం పట్టణంలోని పాతబజార్లోని దుకాణాలన్ని మూసివేశారు. ఇవే అంక్షలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. సీఎం వెళ్లే వరకు పట్టణంలోని దుకాణాలు మూసివేయాలని అంక్షలు విధించారు. ఇక స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
జనసమీకరణ కోసం అన్ని విద్యా సంస్థల బస్సుల్ని స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం నియోజకవర్గం నుంచే కాకుండా పాలకొల్లు, భీమవరం (Palakollu Bhimavaram), తణుకుల నుంచి కూడా సీఎం సభకు జనాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా 700 బస్సుల్ని సిద్ధం చేశారు. ఇక జనసమీకరణ బాధ్యతను వాలంటీర్లు, డ్వాక్రా సంఘాలతో పాటు గ్రామ స్థాయి సిబ్బందికి అప్పగించారు. భోజనం, బస్సు ఆయిల్ ఇతర ఖర్చుల్ని కూడా మండల స్థాయిు అధికారులపై రుద్దారు. ఇక పట్టణంలో ఇనుప బారికేడ్లు కట్టడంతో కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.