అంబటిపై సీఐడీ కేసు పెట్టాలి: ఉమా
ABN , First Publish Date - 2022-06-07T10:17:33+05:30 IST
తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి ప్రచారంలో పెట్టడంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): తన పేరుతో నకిలీ ట్వీట్ సృష్టించి ప్రచారంలో పెట్టడంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈ నకిలీ ట్వీట్ను తనతోపాటు అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన సోమవారం ఇక్కడ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను విమర్శిస్తూ తాను ట్వీట్ చేసినట్లు ఒక నకిలీ ట్వీట్ తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో సోమవారం ప్రచారంలో పెట్టారని తెలిపారు. ఇటువంటి నకిలీ ప్రచారాలు మానుకోవాలని వైసీపీని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడి తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఉమ మాట్లాడారు. నకిలీ ట్వీట్ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటిపై మంగళవారం ఉదయం 11 గంటలకు సీఐడీ చీఫ్ను కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.