వంట నూనెల ధరలపై విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2022-03-16T05:40:48+05:30 IST
వంట నూనెల ధరల అదుపులో భాగంగా కుప్పంలోని కిరాణా దుకాణాలు, హోల్సేల్, రిటైల్ డీలర్లు, ఆయిల్ ట్రేడర్ల వద్ద మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
కుప్పం, మార్చి 15: వంట నూనెల ధరల అదుపులో భాగంగా కుప్పంలోని కిరాణా దుకాణాలు, హోల్సేల్, రిటైల్ డీలర్లు, ఆయిల్ ట్రేడర్ల వద్ద మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మొత్తం 16 దుకాణాలను తనిఖీ చేయగా వాటిలో ఐదు దుకాణాలోని వంట నూనెల ప్యాకెట్లలో వినియోగదారులను మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఎమ్మార్పీలను చెరిపేసి అధిక ధరలకు విక్రయించడం, తయారీ తేదీ లేకపోవడం వంటి నేరాలకు పాల్పడుతున్న ఆ ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె.వెంకటరవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ... వంట నూనె ప్యాకెట్ల మీద ఎమ్మార్పీలను చెరిపేయడం, అధిక ధరలకు విక్రయించడం తీవ్రమైన నేరాలన్నారు. కిరాణా దుకాణాలలో మోసాలకు సంబంధించి వినియోగదారులు నెం.08772224062కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.