ఇళ్ల నిర్మాణాలపై విజి‘లెన్స్’
ABN , First Publish Date - 2022-06-11T08:25:27+05:30 IST
ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించింది.
చిత్తూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి పునాదులు వేసిన లబ్ధిదారులకు రూ.1.80 లక్షల యూనిట్ కాస్ట్లో రూ.70 వేలు ఇస్తున్నారు. దీంతో చాలామంది పునాదులు వేసి తదుపరి పనులు చేపట్టకుండా మానుకుంటున్నారు. దీనిపై అనుమానంతో 45 రోజులుగా ఎలాంటి పురోగతి లేని ఇళ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఆ శాఖ ఎండీ నారాయణ భరత్గుప్తా నుంచి జిల్లాలకు ఆదేశాలు అందాయి. జిల్లాలో ఈ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. పూతలపట్టు మండలంలో విజిలెన్స్ అధికారులు గురువారం పర్యటించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్న సిమెంటు, కమ్మీ తీసుకున్నారా? సద్వినియోగం చేసుకున్నారా.. లేదా.. అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. ఇక నుంచి అన్ని జిల్లాల్లోనూ విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న లేఅవుట్లను గుర్తించడంతో పాటు ఇక్కడ నిర్మాణాలు మందగించిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని భరత్గుప్తా తన ఆదేశాల్లో సూచించారు. అందులోనూ పునాదుల స్థాయిలో ఉన్నవాటిని ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇళ్లు కట్టుకోకుంటే పట్టాలు రద్దు చేస్తామనే బెదిరింపుల నడుమ చాలామంది పునాదులు వేసి వదిలేస్తున్నారనే విషయం తెలిసిందే. జిల్లాల వారీగా ఆ వివరాల జాబితాను ఎండీ భరత్గుప్తా విడుదల చేశారు.
45 రోజులుగా ఎలాంటి ప్రగతి లేని ఇళ్లు: 8388
వీటిలో పునాదులు తవ్వినవి: 1216
పునాదులు పూర్తయినవి: 3808
గోడల నిర్మాణం: 694, పైకప్పు వేసినవి: 2670