2007 డిసెంబరు 31కి ముందు పుట్టిన వారికే టీకా
ABN , First Publish Date - 2022-01-03T08:06:29+05:30 IST
జిల్లాలో 15- 18 ఏళ్ల పిల్లలకు సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2007 డిసెంబరు 31కి ముందు పుట్టిన వారికే టీకా వేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
నేటినుంచి ఆస్పత్రులు, సచివాలయాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్
మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేసేలా ఏర్పాట్లు
చిత్తూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 15- 18 ఏళ్ల పిల్లలకు సోమవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2007 డిసెంబరు 31కి ముందు పుట్టిన వారికే టీకా వేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అన్ని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయల్లో వ్యాక్సినేషన్ వేయనున్నారు. జిల్లాలో 15- 18 ఏళ్ల మధ్య 152805 మంది పిల్లలున్నారు. వీరిలో 9వ తరగతిలో 57383 మంది, పదో తరగతిలో 55074, ఇంటర్ ఫస్టియర్ 49440, సెకండ్ ఇయర్ 48291 మందితోపాటు మరో 50 వేల మంది డ్రాపౌట్స్, పాఠశాలలకు వెళ్లనివారు ఉంటారని అధికారుల అంచనా. వీరందరికీ కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేయనున్నారు. దీనికి 141 పీహెచ్సీలు, 37 అర్బన్ హెల్త్ సెంటర్లు, 1312 సచివాలయాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 6 గంటలకే వ్యాక్సినేషన్ ప్రారంభించి.. మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. సుమారు 1500 మంది ఏఎన్ఎంలు, 2500 వైద్యులు, 3100 ఆశా కార్యకర్తలు వ్యాక్సినేషన్లో పాల్గొననున్నారు. నగర, పురపాలక అధికారులతో పాటు ఎంపీడీవోలు ఇప్పటికే తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులతో, విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి పిల్లలందరికీ టీకా వేయించే బాధ్యత తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి.