తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-12T02:12:13+05:30 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
సమీక్ష నిర్వస్తున్న ఈవో ధర్మారెడ్డి

- ఉదయం 8 నుంచి 10, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు

- పంచమి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమల, నవంబరు11(ఆంరఽధజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల వాహనసేవలు, పంచమితీర్థం ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అనుపమ అంజలి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, నవంబరు 19న అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు. ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రత్యక్షప్రసారం చేస్తామని వివరించారు. పంచమి తీర్థానికి ఈసారి ప్రత్యేకంగా కంపార్టుమెంట్లు, జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుధ్యం మెరుగ్గా ఉండాలని, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని ఎస్పీ, కమిషనర్‌ను కోరారు. పుష్కరిణిలోకి విడతల వారీగా భక్తులను అనుమతిస్తామని, ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. పంచమి తీర్థం రోజు భద్రతా విధులకు 2,500 మంది పోలీసులను వినియోగిస్తామని, వీరికి భోజనం, బస తదితర అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఈ సమీక్షలో ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్‌ కుమార్‌, అదనపు ఎస్పీ కులశేఖర్‌, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T02:12:14+05:30 IST