టైగర్‌ రొయ్యల ధరలు పతనం

ABN , First Publish Date - 2022-10-03T07:18:40+05:30 IST

టైగర్‌ రొయ్యకు ఇటీవల డిమాండ్‌ పెరిగింది. దాంతో సముద్రతీర ప్రాంత మండలాలైన కోట, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరుల్లోని రైతులంతా వెనామి రొయ్యల సాగుకు స్వస్తి పలికి.. టైగర్‌ సాగుబాట పట్టారు

టైగర్‌ రొయ్యల ధరలు పతనం
కొత్తపట్నంలో రొయ్యల గుంట

  - ఆందోళనలో వెనామి రైతులు

 

జపాన్‌, ఇండోనేషియా, తైవాన్‌ దేశాల్లో టైగర్‌ రొయ్యలకు డిమాండ్‌ ఏర్పడటంతో వెనామి రైతులు ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఈ సాగువైపు మొగ్గుచూపారు. ఇప్పటికే జుతామి ఫంగస్‌ సోకడంతో భారీగా నష్టపోయారు. ప్రస్తుతం ధరలు పతనమవడంతో ఆందోళన చెందుతున్నారు. 

- కోట


టైగర్‌ రొయ్యకు ఇటీవల డిమాండ్‌ పెరిగింది. దాంతో సముద్రతీర ప్రాంత మండలాలైన కోట, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరుల్లోని రైతులంతా వెనామి రొయ్యల సాగుకు స్వస్తి పలికి.. టైగర్‌ సాగుబాట పట్టారు. ధరలు పెరుగుతుండటంతో గత ఏడాది నుంచి 2,500 ఎకరాలకుపైగా భూముల్లో టైగర్‌ రొయ్యల సాగును చేపట్టారు. ఈ ఏడాది కొత్తగా జుతామి ఫంగస్‌ రావడంతో రొయ్యపిల్లలు చనిపోతూ వచ్చాయి. ఆ నష్టాల నుంచి కోలుకోకముందే ప్రస్తుతం ధరలు పడిపోతూ వస్తున్నాయి. బయ్యర్లు ఎక్కువగా కొనుగోలుచేసే 20కౌంట్‌ టైగర్‌ రొయ్యలు గతంలో రూ.640 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.460కి పడిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ నాలుగు మండలాల్లోనే టైగర్‌ రొయ్యలు ఉండడంతో బయ్యర్లు సిండికేట్‌గా మారి ధరలు పడిపోయాయని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కోట మండలం కొత్తపట్నం, శ్రీనివాసాపురం, గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం గ్రామాల్లో రైతులు సరైన కౌంట్‌ రాకున్నా రొయ్యలను పట్టేసి.. వచ్చినకాడికి తెగనమ్ముకుంటున్నారు. మొత్తానికి వెనామి సాగులో లాభాలు రావడం లేదని.. టైగర్‌ రొయ్యలను సాగు చేస్తే మరింత నష్టపోయామని రైతులు వాపోతున్నారు. 


ధరల పతనమిలా..


కౌంట్‌ రూపాయల్లో


గతం ప్రస్తుతం

20    640 - 460 

21  580 - 440 

22  500 - 420 

23  540 - 410 

24  530 - 410 

25, 26 510 - 400 

27, 30  480 - 390

40 370 - 300


Updated Date - 2022-10-03T07:18:40+05:30 IST