కదిలిస్తే కన్నీళ్లే..!

ABN , First Publish Date - 2022-12-09T00:36:16+05:30 IST

ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. అయ్యో.. దేవుడా, ఇక.. ఆ కుటుంబానికి దిక్కెవరు? ముక్కు పచ్చలారని చిన్న పిల్లలనూ తీసుకెళ్లావే.. అమ్మా, మేమెలా బతకాలన్న రోదనలు ఆయా గ్రామాల్లో మిన్నంటాయి.

కదిలిస్తే కన్నీళ్లే..!
తేజ, ఆమె పిల్లలు దినేష్‌, దేషిక మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

ఆరుగురికి ముగిసిన అంత్యక్రియలు

డ్రైవరు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?

ఎన్‌హెచ్‌కోసం రోడ్డు పక్కన తవ్విన గుంతలతోనే ఇంతటి ఘోరం

చిత్తూరు, ఆంధ్రజ్యోతి/ చిత్తూరు రూరల్‌/ ఐరాల/ పూతలపట్టు, డిసెంబరు 8: ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. అయ్యో.. దేవుడా, ఇక.. ఆ కుటుంబానికి దిక్కెవరు? ముక్కు పచ్చలారని చిన్న పిల్లలనూ తీసుకెళ్లావే.. అమ్మా, మేమెలా బతకాలన్న రోదనలు ఆయా గ్రామాల్లో మిన్నంటాయి. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే, పెళ్లి కబుర్లతో సందడిగా ఉండాల్సిన బలిజపల్లె ఎస్సీ కాలనీ.. విషాదంలో మునిగిపోయింది. పూతలపట్టు మండలం లక్ష్మయ్యఊరు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో మరణించిన ఆరుగురి అంత్యక్రియలు గురువారం వారివారి స్వగ్రామాల్లో పూర్తయ్యాయి. మూడు కుటుంబాలకు శోకం.. వారి బంధువులకు విషాదం మిగిల్చిన ఈ ప్రమాదాన్ని తలచుకుంటూ.. పరామర్శకు వచ్చిన వారివద్ద బోరుమంటున్నారు. భార్య తేజ, పిల్లలు దినేష్‌, దేషికలను కోల్పోయిన గుణశేఖర్‌ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ‘ఈ పెళ్లి కోసమే నేను, నా భార్యా పిల్లలు బుధవారం ఉదయం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చిత్తూరుకు వచ్చాం. అక్కడ్నుంచి నేరుగా తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లెలో ఇంటికెళ్లాం. మధ్యాహ్నం 2 గంటలకు బలిజపల్లె ఎస్సీకాలనీకి చేరుకున్నాం. అక్కడ సాంగ్యాలు వంటివి పూర్తయ్యాక రాత్రి నేను బైక్‌లో ముందే పెళ్లికుమార్తె ఊరు జెట్టిపల్లెకు వెళ్లిపోయా. బంధువులతో సరదాగా మాట్లాడుకుంటూ వస్తామని పిల్లలతో కలిసి నా భార్య ట్రాక్టరులో వచ్చింది. ట్రాక్టరు బోల్తా పడిందని మా పిన్ని ఫోను చేసేసరికి హడావిడిగా అక్కడికి వెళ్లా. చూస్తే నా భార్యా పిల్లలు బతికిలేరు. సర్వసం కోల్పోయాను. నేనెలా బతకాలి’ అంటూ విలపిస్తున్నారు.

జెట్టిపల్లెలోనూ విషాదఛాయలు

పెళ్లికుమార్తె గ్రామం జెట్టిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికి ఏర్పాటుచేసిన లైటింగ్‌, పందిళ్లు వంటివన్నీ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే బుధవారం రాత్రే తొలగించేశారు. పెళ్లికుమార్తె తండ్రి వెంకటేష్‌ నాలుగేళ్ల కిందట మరణించగా, తల్లి ఆదిలక్ష్మి చిత్తూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తూ ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటున్నారు. ‘పెళ్లికుమార్తెది చాలా పేద కుటుంబం. హేమంత్‌తో పెళ్లి కుదరడంతో మంచి రోజులు వచ్చాయంటూ కుటుంబసభ్యులు, బంధువులు మురిసిపోయారు. అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని స్థానికులు ఆవేదన చెందారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పెళ్లికుమార్తె ఇంట్లో నుంచి బయటికి రాలేదు. గ్రామానికి చెందిన మహిళలు ఆమెను పరామర్శిస్తున్నారు.

Updated Date - 2022-12-09T00:36:32+05:30 IST