టీడీపీ నేతలకు మరో 14 రోజులు రిమాండ్
ABN , First Publish Date - 2022-09-10T05:34:40+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల్లో అరెస్టయిన ఆరుగురు టీడీపీ నేతలకు కుప్పం అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మరో రెండు వారాలు రిమాండ్ విధించారు.
కుప్పం, సెప్టెంబరు 9: మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల్లో అరెస్టయిన ఆరుగురు టీడీపీ నేతలకు కుప్పం అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మరో రెండు వారాలు రిమాండ్ విధించారు. గత నెల 24, 25, 26 తేదీల్లో రామకుప్పం మండలం కొళ్లుపల్లి, కుప్పం పట్టణాలలో జరిగిన ఘటనల్లో మొత్తం 60 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, రామకుప్పం మాజీ జడ్పీటీసీ మునస్వామి, ఆర్ఎస్.మణి, మంజునాథ్, ముఖేష్ (అప్పు)లను రెండు వారాల క్రితం అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. అలా రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం ఆ ఆరుగురు నాయకులను జైలునుంచి కుప్పం తీసుకొచ్చి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారందరికీ తిరిగి రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు తిరిగి ఆ నాయకులను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. జైలునుంచి టీడీపీ నాయకులు రాక సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కోర్టు ప్రాంతంలోకి తరలిచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న గౌనివారి శ్రీనివాసులు, మునస్వామి తదితరులను చూసి జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కువమంది కోర్టు వద్ద గుమిగూడకుండా జనాలను చెదరగొట్టారు.