పాలవెల్లువ లక్ష్యం పెంచండి
ABN , First Publish Date - 2022-10-12T05:26:19+05:30 IST
జిల్లాలో పాలసేకరణ లక్ష్యాన్ని మరింత పెంచి పాలవెల్లువ పెంచాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 11: జిల్లాలో పాలసేకరణ లక్ష్యాన్ని మరింత పెంచి పాలవెల్లువ పెంచాలని కలెక్టర్ హరినారాయణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోజుకు 11,840 లీటర్ల పాలసేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు అనువుగా క్షేత్రస్థాయిలో పాడిపశువుల పెంపకం, దాణా తదితరాలపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. వి.కోట, శాంతిపురం, రామకుప్పంలలో 74 కేంద్రాల ద్వారా పాలసేకరణ కొనసాగుతోందని వివరించారు. పాడిరైతులు అందించే పాలనాణ్యతను బట్టి లీటరుకు రూ.33 నుంచి రూ.39 వరకు ధర చెల్లిస్తున్నట్లు డెయిరీ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ నవీన్ తెలిపారు. ఈ సమావేశంలో డీసీవో బ్రహ్మానందరెడ్డి, డెయిరీ డెవల్పమెంట్ ఆఫీసర్ రవిచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.