పాఠశాలల విలీనంతో విద్యార్థులకు తీరని నష్టం

ABN , First Publish Date - 2022-04-25T05:22:39+05:30 IST

రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహనదాస్‌ పేర్కొన్నారు.

పాఠశాలల విలీనంతో విద్యార్థులకు తీరని నష్టం
మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌దాస్‌

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 24: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహనదాస్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని యూత్‌ హాస్టల్లో ఆదివారం ఆ సంఘం తిరుపతి జిల్లా నూతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల విలీనానికి సంబంధించిన మెమరాండంను రద్దు చేయాలన్నారు. కిలో మీటర్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరాన్ని పెంచుతూ జారీచేసిన జీవోను ఆపాలని కోరారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20గా, ఉన్నత పాఠశాలలో తరగతికి 40మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్‌ ఏర్పాటుచేసి సమాంతరం మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్‌ పరిధిలో విద్యార్థులు ప్రాథమిక విద్యను పూర్తిచేయాల్సి ఉందని గుర్తు చేశారు. అలాగే పాఠశాలల పునఃప్రారంభంలోపు ఖాళీగా ఉన్న 25వేల టీచర్‌ పోస్టులను భర్తీచేయాలని, వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సుబ్బారావు, చిరంజీవి, మహమ్మద్‌రఫి, ఆనందనాయుడు, సుబ్బారెడ్డి, కిరణ్‌, నాదముని, వెంకటముని, నరేంద్ర, పార్వతి పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-04-25T05:22:39+05:30 IST