లుంపి స్కిన్ వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాం: జేసీ
ABN , First Publish Date - 2022-09-17T05:51:08+05:30 IST
జిల్లాలో పలు ప్రాంతాల్లో పశువులకు లుంపి స్కిన్ వాఽ్యధి సోకిందని జేసీ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
చిత్తూరు కల్చరల్, సెప్టెంబరు16: జిల్లాలో పలు ప్రాంతాల్లో పశువులకు లుంపి స్కిన్ వాఽ్యధి సోకిందని జేసీ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. వీటి నివారణకు ఇదివరకే చర్యలు చేపట్టామని వివరించారు. ఇతర ప్రాంతాల నుంచి రైతులు కొనుగోలు చేసిన పశువులనుంచి ఈ వ్యాధి సంక్రమిస్తోందని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని 20 మండలాల్లో ఉన్న 115 గ్రామాల్లో లుంపి స్కిన్ వ్యాధి సోకిందని నిర్ధారణ అయిందన్నారు. ఇప్పటికే 18500 పశువులకు టీకాలు వేశామని తెలిపారు. మరో 14100 పశువులకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రైతులు 10500 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు కావాలని ధరఖాస్తు చేసుకున్నారన్నారు. వీటిలో 450 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లాలో పట్టు పరిశ్రమ షెడ్లకు బీమా చేయడానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించామని, అనుమతి రాగానే అమలు చేస్తామన్నారు. పంటలకు పురుగు మందులు స్ర్పే చేయడానికి 93 డ్రోన్లు మంజూరయ్యాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. వీటన్నింటిని కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల వద్ద ఉంచనున్నట్లు చెప్పారు. వీటి ద్వారా 12 లీటర్ల పురుగు మందులను 12 నుంచి 15 నిమిషాల్లోపు ఎకరం వరకు స్ర్పే చేయొచ్చన్నారు. ఈ డ్రోన్లను బ్యాటరీతో ఆపరేట్ చేయొచ్చన్నారు. మామిడితోటలకు మందులు పిచికారి చేయడానికి ఉపయోగించడానికి వీలువుతుందా లేదా అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నట్లు చెప్పారు. సభ్యుడు గోవర్ధన్ బాబి మాట్లాడుతూ భూముల పాస్పుస్తకాల్లో తేడాలు వున్నాయని సరి చేయాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే 66 గ్రామాల్లో భూములను డ్రోన్లతో రీసర్వే చేయడం జరిగిందని జేసీ తెలిపారు. అక్టోబరు 2 నాటికి పలు గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతుందన్నారు. మరో 8 నుంచి 10 నెలలోపు భూ రీ సర్వే పూర్తవుతుందన్నారు. మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధకశాఖ అధికారి వెంకట్రావు, సిరకల్చర్ అధికారి శోభరాణి, మార్కెటింగ్ అఽధికారి పరమేశ్వర్, ఇరిగేషన్ ఎస్ఈ విజయ్కుమార్ రెడ్డి, ఎపీ సీడ్స్ మేనేజర్ సంపత్ కుమార్, ఎల్డీఎం శేషగిరిరావు, , కేన్ కమిషనర్ జాన్ విక్టర్, గోవర్ధన్, జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.