ముక్కంటి శయనమందిరాన్నీ వదల్లేదు!

ABN , First Publish Date - 2022-09-30T07:41:22+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొందరు ఉద్యోగులు సంపాదనే ధ్యేయంగా ఎంతకైనా తెగిస్తున్నారు.జ్ఞానప్రసూనాంబ సన్నిధిలో శయనమందిరం(పళ్లియర) ఉంది.

ముక్కంటి శయనమందిరాన్నీ వదల్లేదు!

పళ్లియరకూ పాకిన ఆలయ ఉద్యోగుల వసూళ్లు

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 29: శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొందరు ఉద్యోగులు సంపాదనే ధ్యేయంగా ఎంతకైనా తెగిస్తున్నారు.జ్ఞానప్రసూనాంబ సన్నిధిలో శయనమందిరం(పళ్లియర) ఉంది. రోజూ రాత్రి ఆలయం మూసివేసే ముందు ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహిస్తారు.అనంతరం శయనమందిరంలో ఊయలపై కొలువు తీరుస్తారు.ఏకాంత సేవ నిర్వహించి పవళింపు ఘట్టం పూర్తయ్యాక ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి వేకువజామున ఆలయం తెరిచిన వెంటనే పళ్లియరలోని ఊయలలో శయనించిన స్వామి అమ్మవార్లను సుప్రభాతసేవ ద్వారా మేల్కొలుపుతారు.అక్కడినుంచి స్వామిఅమ్మవార్లు సన్నిధిలోకి చేరుకుంటారు. అలాంటి ఈ సేవ కోసం అమ్మవారి సన్నిధిలో ఉన్న శయనమందిరాన్ని కొందరు దర్జాగా వసూళ్లకు అడ్డాగా మార్చుకున్నారు. పగటిపూట శయనమందిరాన్ని తెరిచి ఉంచి భక్తులను ఆహ్వానిస్తున్నారు. స్వామి అమ్మవార్లు కొలువుతీరే ఊయలను తాకి నమస్కరించుకుని కానుకలను సమర్పించాలని అడుగుతున్నారు. గురువారం ఉదయం అమ్మవారి సన్నిధిలో పళ్లియర వద్ద ఒక ఉద్యోగి నిలబడి అందరినీ రండి రండి అంటూ పిలవసాగాడు. భక్తులు కూడా బారులు తీరారు.వారిని కట్టడి చేస్తూ మరో ఉద్యోగి క్యూలైనులో రమ్మంటున్న ఘటన చూపరులకు ఆశ్చర్యం కలిగించింది.

Updated Date - 2022-09-30T07:41:22+05:30 IST