దసరాకు ఆర్టీసీ చార్జీలు యథాతథం
ABN , First Publish Date - 2022-09-24T07:24:16+05:30 IST
దసరా పర్వదినాల్లో ఆర్టీసీ బస్సు చార్జీల ప్రత్యేక పెంపు ఉండదని, యథాతథంగానే ఉంటాయని పీటీడీవో చెంగల్రెడ్డి తెలిపారు.
ప్రత్యేకంగా పెంచడం లేదు
విద్యార్థులు సమూహంగా కోరితే బస్సులు పంపుతాం
99592 25684 నెంబరుకు ఫోన్ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు
పీటీడీవో చెంగల్రెడ్డి
తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 23: దసరా పర్వదినాల్లో ఆర్టీసీ బస్సు చార్జీల ప్రత్యేక పెంపు ఉండదని, యథాతథంగానే ఉంటాయని జిల్లా ప్రజారవాణాధికారి (పీటీడీవో) చెంగల్రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక సెంట్రల్ బస్సు స్టేషన్ ఏటీఎం చాంబర్లో మీడియాతో మాట్లాడారు. సెలవుల్లో నగరాల నుంచి పల్లెలకు రాకపోకల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా అదనపు సర్వీసులను నడపేందుకు చర్యలు చేపట్టామన్నారు. తిరుపతి నుంచి హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, చెన్నై, కడప, మదనపల్లె, నెల్లూరు, కర్నూలు, అనంతపురం నగరాలకు అవసరమైన ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాలయాలకు, కళాశాలలకు సెలవులు రానున్ననేపథ్యంలో సమూహంగా ఏర్పడి విద్యార్థులు కోరితే బస్సులు పంపుతామన్నారు. ఇందుకోసం 99592 25684 నెంబరును సంప్రదించాలని సూచించారు.
హైదరాబాదుకు త్వరలో మరో ఏసీ స్లీపర్
తిరుపతి-హైదరాబాదు మధ్య మరో ఏసీ స్లీపర్ బస్సును త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు చెంగల్రెడ్డి తెలిపారు. ఎలక్ర్టిక్ బస్సు ఒకటి ట్రయల్ అండ్ టెస్టింగ్లో ఉందన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ముందుగా పది బస్సులు వచ్చే అవకాశం ఉందన్నారు. డిసెంబరులో మొత్తం 100 విద్యుత్ బస్సులు రానున్నాయని స్పష్టం చేశారు. ఒకే యాప్ ద్వారా ఈ-పాస్ మెషిన్ అందుబాటులోకి వచ్చిందని, ఇప్పటికి 200 మెషిన్లు వివిధ మార్గాల్లోని బస్సుల్లో వినియోగిస్తున్నట్లు వివరించారు. డిసెంబరులోపు అన్ని బస్సుల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా నగదు రహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో అమలవుతాయని చెప్పారు.
శబరిమలై యాత్రకు అద్దె బస్సులు
వచ్చేనెల నుంచి శబరిమలై ఉత్సవాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అయ్యప్పభక్తులకు అన్నిరకాల బస్సులను అద్దె ప్రాతిపదికన ఇస్తామని పీటీడీవో చెప్పారు. ఇదే తరహాలో మేల్మలవత్తూరుకు కూడా బస్సులు పంపుతామన్నారు. ఆసక్తి ఉన్న భక్తులు సమీప డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.