డీఎంహెచ్వోగా ప్రకాశం బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2022-12-12T23:47:47+05:30 IST
చిత్తూరు డీఎంహెచ్వోగా ప్రకాశం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి డీఎంహెచ్వో శ్రీహరి ఈయనకు బాధ్యతలు అప్పగించారు.
తుఫాను నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
చిత్తూరు రూరల్, డిసెంబరు 12: చిత్తూరు డీఎంహెచ్వోగా ప్రకాశం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి డీఎంహెచ్వో శ్రీహరి ఈయనకు బాధ్యతలు అప్పగించారు. డీఎంహెచ్వో ప్రకాశంను డీఐవో రవిరాజు, ఏవో రమేష్, అధికారులు, సిబ్బంది అభినందించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. మాండస్ తుఫాను ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజల ఆరోగ్య స్థితి గతులను తెలుసుకోవాలన్నారు. జ్వరాలు, వాంతులు, విరేచనాలుంటే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ట్యాంకులు శుభ్రం చేయించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరినేషన్ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. మండల, పీహెచ్సీ కేంద్రాల పరిధిలోనే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కాచి, వడపోసిన నీటినే తాగాలని ప్రజలకు సూచించారు.