ఇనాం భూముల కబ్జా
ABN , First Publish Date - 2022-09-17T06:49:24+05:30 IST
భటవర్తి ఇనాం భూములను కబ్జా చేస్తున్నారంటూ పుంగనూరు సీఐ గంగిరెడ్డికి శుక్రవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు, ఇనాము భూముల వారసులు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నాయకుడిపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు
పుంగనూరు, సెప్టెంబరు 16: భటవర్తి ఇనాం భూములను కబ్జా చేస్తున్నారంటూ పుంగనూరు సీఐ గంగిరెడ్డికి శుక్రవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు, ఇనాము భూముల వారసులు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు, తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు పట్టణ సమీపంలోని చెంగలాపురం దాఖలాలోని సర్వే నెంబర్లు 185/1ఎ లోని 5.20 ఎకరాలు, 185/3ఎ లోని 1.60 ఎకరాలు, 185/4ఎలోని 1.10 ఎకరాలు.. ఇలా మొత్తం 7.90 ఎకరాల భూమిని నాటి జమీందారులు 20 మంది పేరిట భటవర్తి ఇనాము ఇచ్చారు. ఈ భూములకు సంబంధించి ఇంతవరకు భాగపరిష్కారం జరగలేదు. ఇందులో చాలామంది దళితులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు నరసింహులు ఆ భూములను ఆక్రమించుకుని దళితులను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇనాముదారుల్లోని నక్కనపల్లె అజీజ్ఖాన్ మనవడైన సాహులు హామీద్ భటవర్తి ఇనాము భూముల్లోని 5.70 ఎకరాల్లోని సర్వే నెంబరు 185/1బిలో ఖాతా నెంబరు 740తో తప్పుడు పట్టాదారు పుస్తకం అక్రమంగా పొందారని తహసీల్దారుకు ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణకు ఆదేశించారని వివరించారు. చెంగలాపురానికి చెందిన నరసింగారావు ఈ భూమి తనదేనని భూముల చుట్టూ రాతికూసాలు నాటిస్తానని, దౌర్జన్యంగా కూసాలు నాటుతూ భూములను దురాక్రమణ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేసి భటవర్తి ఇనాము భూములను కాపాడాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఇనాముదారు వారసులైన రాజన్న, శ్రీనివాసులు, కుమార్, బాలాజీ, మధుబాబు తదితరులు సీఐను కోరారు.