దుకాణాల ఆక్రమణలుంటే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-12-13T23:54:03+05:30 IST
తిరుమలలోని దుకాణ దారులు, హాకర్ లైసెన్సు దారులు టీటీడీ నిబంధనలను అతిక్రమిస్తూ ఆక్రమణులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ రెవిన్యూ విభాగం మంగళవారం నోటీసులు జారీ చేసింది.
- నోటీసులు జారీ చేసిన రెవిన్యూ
తిరుమల, డిసెంబరు13(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని దుకాణ దారులు, హాకర్ లైసెన్సు దారులు టీటీడీ నిబంధనలను అతిక్రమిస్తూ ఆక్రమణులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ రెవిన్యూ విభాగం మంగళవారం నోటీసులు జారీ చేసింది. టీటీడీ కేటాయించిన స్థలం కంటే అధికంగా స్థలాన్ని అక్రమించుకుని కొందరు వ్యాపారులు నడవడానికి కూడా వీలులేకుండా వ్యవహరిస్తున్నారని టీటీడీ విజిలెన్స్ విభాగానికి కొంతకాలంగా భక్తుల నుంచి ఫిర్యాదులు అందు తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమిస్తూ స్థలాన్ని అక్రమించి వ్యాపారాలు చేస్తే విక్ర యానికి ఉంచి వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్స్లు రద్దు చేస్తామంటూ టీటీడీ రెవిన్యూ విభాగం మంగళవారం నోటీసులు జారీ చేసింది.
- మొదలైన నూతన ప్రొసిడింగ్ జారీ ప్రక్రియ
కొద్దిరోజులుగా పెండింగ్లో ఉన్న లైసెన్స్ రెన్యువల్స్ జారీ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కొన్నేళ్లు తిరుమలలోని దుకాణాలు, ఇళ్లు, హాకర్స్ లైసెన్స్లు రెన్యువల్స్కు నోచుకోని విషయం తెలిసిందే. ఈక్రమంలో లైసెన్స్లన్సీ రెన్యూవల్ చేయాలంటూ టీటీడీ బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకున్న క్రమంలో టీటీడీ రెవిన్యూ, విజిలెన్స్, హెల్త్ విభాగాలు అన్ని లైసెన్సులను గత మూడు నెలల నుంచి పరిశీలించారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయిన క్రమంలో 2025 మార్చి వరకు కాలపరిమితిని పెంచుతూ లైసెన్స్లను రెన్యూవల్ చేశారు. ఈమేరకు మంగళవారం 40 ప్రొసీడింగ్స్కు ఆమోదం తెలిపారు. కాగా బుధవారం నుంచి రోజుకు 40 చొప్పున రెన్యువల్ చేసిన లైసెన్సులను వ్యాపారులకు జారీ చేయనున్నారు.