త్వరలో మరిన్ని కరెంటు బస్సుల రాక

ABN , First Publish Date - 2022-09-13T06:25:11+05:30 IST

త్వరలోనే మరిన్ని ఎలక్ర్టిక్‌ బస్సులు తిరుపతికి రానున్నాయని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణాధికారి టి.చెంగల్‌రెడ్డి పేర్కొన్నారు.

త్వరలో మరిన్ని కరెంటు బస్సుల రాక
బస్సును పరిశీలిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు

జిల్లా ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి


తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 12: త్వరలోనే మరిన్ని ఎలక్ర్టిక్‌ బస్సులు తిరుపతికి రానున్నాయని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణాధికారి టి.చెంగల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి అలిపిరి డిపోకు చేరిన నూతన కరెంటు  బస్సును ఆయన సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొత్తం వందబస్సులు వస్తాయని చెప్పారు. తిరుమల-తిరుపతి, తిరుపతి- విమానాశ్రయం మధ్య 64, తిరుపతి నుంచి నాన్‌స్టా్‌పగా నెల్లూరు, మదనపల్లె, కడప పట్టణాలకు 12 చొప్పున నడుపుతామన్నారు. బస్సు రూపకల్పన ఆకర్షణీయంగా తయారు చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్‌లో ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ప్రయాణికులు కూడా ఏసీ బస్సులను ఆదరిస్తారని భావిస్తున్నామన్నారు. తిరుమల కొండకు మినహా ఇతర మార్గాల్లో తిరిగే బస్సులు 12మీటర్ల పొడవుతో 50సీట్ల సామర్థ్యంతో వస్తాయన్నారు. వచ్చే ఐదేళ్లలో పూర్తిస్థాయిలో కరెంటు బస్సులే అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని వెల్లడించారు. ఘాట్‌లో ఈ బస్సుల నిర్వహణకు సంబంధించి విధివిఽధానాలు త్వరలో నిర్ణయిస్తామన్నారు. ఇక్కడ డ్రైవింగ్‌ స్కూల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకే  కరెంటు బస్సు డ్రైవర్లుగా అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని తెలియజేశారు. ఈనెల 27న శ్రీవారి బ్రహ్మత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రితో ఈ విద్యుత్‌ బస్సులను ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం భాస్కర్‌, అలిపిరి డిపో మేనేజర్‌ హరిబాబు, సీబీఎస్‌ కంట్రోలర్‌ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-13T06:25:11+05:30 IST