Cyclone Mandus: వణికిస్తున్న మాండస్‌ తుఫాన్‌

ABN , First Publish Date - 2022-12-09T19:28:19+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్‌ తుఫాన్‌ (Cyclone Mandus) తిరుపతి జిల్లాను వణికిస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచే చలి గాలులు, వర్షాలు మొదలయ్యాయి.

Cyclone Mandus: వణికిస్తున్న మాండస్‌ తుఫాన్‌

తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్‌ తుఫాన్‌ (Cyclone Mandus) తిరుపతి జిల్లాను వణికిస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచే చలి గాలులు, వర్షాలు మొదలయ్యాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. దాదాపు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచాయి. పలుచోట్ల పంటనష్టం సంభవించింది. చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. రేణిగుంట రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో వర్షపునీరు చేరింది. వాకాడు, కోట మండలాల్లోని సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్‌ ప్రభావంతో వాకాడులో 40 మీటర్లు, కోటలో 20 మీటర్ల వరకు సముద్రం ముందుకొచ్చింది. ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పంబలి, శ్రీనివాససత్రం, కాకివాకం తదితర తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తడ మండలంలో 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. తుఫాన్‌ సహాయక చర్యల్లో భాగంగా గూడూరులో 23మంది, నాయుడుపేటలో 26మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలను వుంచారు. సముద్రంలో వేటకు వెళ్లిన 203మంది మత్స్యకారులను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. హైదరాబాద్‌ (Hyderabad) నుంచి తిరుపతికి చేరుకుని ఉదయం 7.40గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానం, బెంగుళూరు (Bangalore) నుంచి తిరుపతి మీదుగా వైజాగ్‌ వెళ్లాల్సిన స్సైస్‌జెట్‌ విమానం వాతావరణం అనుకూలించక 20నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి వెనక్కి వెళ్లిపోయాయి. ముంబై వెళ్లాల్సిన విమానం మాత్రం మళ్లీ 3గంటలు ఆలస్యంగా తిరుపతి చేరుకుని ముంబై బయల్దేరి వెళ్లింది. మరో మూడు సర్వీసులను రద్దు చేశారు. వర్షంతో పాటు చలితీవ్రత బాగా పెరగడంతో జనజీవనం స్తంభించిపోయింది.

Updated Date - 2022-12-09T19:28:21+05:30 IST