మదనపల్లె జిల్లా కోసం ఉపరాష్ట్రపతికి లేఖ

ABN , First Publish Date - 2022-02-19T07:12:54+05:30 IST

కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు కోసం జిల్లాలో ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి.మదనపల్లెకున్న చారిత్రక, భౌగోళిక విశిష్టతల నేపధ్యంలో దాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు.

మదనపల్లె జిల్లా కోసం ఉపరాష్ట్రపతికి లేఖ
నగరిలో విద్యార్థుల మానవహారం

కుప్పంలో టీడీపీ సర్పంచుల రాజీనామా ఆల్టిమేటం


జిల్లాల, డివిజన్ల ఏర్పాటుపై కొనసాగిన ఆందోళనలు


తిరుపతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు కోసం జిల్లాలో ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి.మదనపల్లెకున్న చారిత్రక, భౌగోళిక విశిష్టతల నేపధ్యంలో దాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. ఇటీవల తిరుమల పర్యటన సందర్భంగా నేరుగా కలసి వినతి పత్రం అందజేయాలని భావించినా కఠినమైన ప్రోటోకాల్‌ నిబంధల కారణంగా వీలు కాలేదని లేఖలో ఉపరాష్ట్రపతికి విన్నవించారు. జనగణమన గేయాన్ని రవీంద్రనాధ్‌ టాగోర్‌ భారత సుప్రభాత గీతంగా తొలిసారి ప్రకటించి, బెంగాలీ నుంచీ ఆంగ్లంలోకి తర్జుమా చేసి, బాణీ కట్టి ఆలపించింది మదనపల్లెలోనే అన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. అనిబిసెంట్‌ నాయకత్వంలో మదనపల్లె విద్యార్థులు, ప్రజలు సాగించిన జాతీయ పోరాటాన్ని కూడా గుర్తు చేశారు. పాలనా కేంద్రంగా బ్రిటిష్‌ కాలం నుంచీ పేరుపడ్డ మదనపల్లెను ప్రత్యేక జిల్లాగా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా ఉపరాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. కాగా మదనపల్లెలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట జిల్లా సాధన జేఏసీ, అఖిలపక్షం నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ కన్వీనర్‌ నరేంద్ర బాబు, జనసేన ఇంఛార్జి గంగారపు రామ్‌దాస్‌ చౌదరి, మాలమహానాడు నేత యమలా సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. అలాగే మదనపల్లె మండలం ఇసుకనూతిపల్లిలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన ప్రదర్శన చేపట్టారు.కుప్పం కేంద్రంగా రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు కోసం ఆందోళన చేపట్టిన అఖిలపక్షానికి శుక్రవారం కుప్పం నియోజకవర్గంలోని 14 మంది టీడీపీ సర్పంచులు మద్దతు ప్రకటించారు. పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి వచ్చిన సర్పంచులు సంఘీభావం ప్రకటించి కొంతసేపు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయకపోతే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. శిబిరంలో సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది.నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలంటూ నగరిలో సూర్య కాలేజీ విద్యార్థులు పాదయాత్ర నిర్వహించారు.

Updated Date - 2022-02-19T07:12:54+05:30 IST