మదనపల్లె జిల్లాకోసం ఉపరాష్ట్రపతికి లేఖ

ABN , First Publish Date - 2022-02-19T06:07:28+05:30 IST

చార్రితక నేపథ్యం, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మదనపల్లెను జిల్లాగా ప్రకటించ డంలో రాష్ట్రప్రభుత్వ వైఖరి సహేతుకంగా లేదని, జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వానికి సూచించాలని, లేకపోతే కర్ణాటక రాష్ట్రంలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మదనపల్లె జిల్లా సాధన సమితి(ఎంజేఎస్‌ఎస్‌ ) కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ శుక్రవారం లేఖ రాశారు.

మదనపల్లె జిల్లాకోసం ఉపరాష్ట్రపతికి లేఖ

ఈమెయిల్‌లో పంపిన ఎంజేఎస్‌ఎస్‌ కన్వీసర్‌ పీటీఎం శివప్రసాద్‌


మదనపల్లె, ఫిబ్రవరి 18: చార్రితక నేపథ్యం, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మదనపల్లెను జిల్లాగా ప్రకటించ డంలో రాష్ట్రప్రభుత్వ వైఖరి సహేతుకంగా లేదని,  జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వానికి సూచించాలని, లేకపోతే కర్ణాటక రాష్ట్రంలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మదనపల్లె జిల్లా సాధన సమితి(ఎంజేఎస్‌ఎస్‌ ) కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ శుక్రవారం లేఖ రాశారు. గత వారంలో తిరుపతికి విచ్చేసిన ఉపరాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నించామని అయితే అపాయింట్‌మెంట్‌ దొరకలేదని, ఢిల్లీ వెళ్లి అయినా వినపతిపత్రం ఇవ్వాలని జిల్లా సాధనసమితి బృందం ప్రయత్నించినా వీలుకాలేదన్నారు. దీంతో ఉపరాష్ట్రపతి ఈమెయిల్‌కు లేఖ పంపామన్నారు. ఈ లేఖలో మదనపల్లె చారిత్రక నేపథ్యాన్ని, ఇక్కడి ప్రత్యేకతలను వివరించారు. జాతీయగీతం జనగణమనను విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌  బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ఇక్కడి బీటీ కళాశాలలోనే స్వరపరచారని, నేడు జనగణమన అంటూ సగర్వంగా గానం చేస్తున్న గీతానికి జన్మనిచ్చింది మదనపల్లెనని గుర్తు చేశారు. హోంరూల్‌ ఉద్యమకర్త అనిబిసెంట్‌ 1919లో ఇక్కడ బీటీ కళాశాలను ఏర్పాటు చేశారని, రాయలసీమలోనే తొలి డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మించింది కూడా మదనపల్లెలోనే అని తెలిపారు. ఆసియాలోనే టీబీ రోగుల వైద్యం కోసం శానిటోరియం మదనపల్లెలో ఏర్పాటైందని, కవయిత్రి వెంగమాంబ ఈ ప్రాంతంలోని తరిగొండలొ జన్మించారని, గుర్రంకొండలో టిప్పుసుల్తాన్‌ విద్యాభ్యాసం చేశారని, ఇక్కడి చేనేత చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌ మదనపల్లెలోనే ఉందని, ఈ ప్రాంతంలో తయారయ్యే టెర్రకోట ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందన్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కల్గిన మదనపల్లెను కాదని, రాయచోటిని జిల్లా కేంద్రం చేయాలని  రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. మదనపల్లెకు 1846 నాటికే సబ్‌కలెక్టరేట్‌ హోదా వచ్చిందని, 1875నాటికే ఇక్కడ మున్సిఫ్‌ కోర్టు ఏర్పాటైందని, దేశంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్‌గా సేవలందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇక్కడ జిల్లాకోర్టు, జిల్లా ఆస్పత్రితో పాటు అన్ని ప్రభుత్వశాఖల ప్రధాన కార్యాలయాలున్నాయని పేర్కొన్నారు.  అన్ని అర్హతలు మదనపల్లెకు ఉన్నా కేవలం రాజకీయ అవసరాల కోసమే జిల్లా కాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. మదనపల్లె మీదుగా మంజూరైన కడప-బెంగళూరు రైల్వే లైను గుత్తిమీదకు మార్చేశారని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మించలేదని, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు ఇక్కడికి తీసుకురాలేదని, కొత్తగా పరిశ్రమలు రాలేదని, ఉద్దేశపూర్వకంగానే మదనపల్లెను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కాబట్టే ఇక్కడి ప్రజలు  తమ ప్రాంతాన్ని కర్ణాటక రాష్ట్రంలో కలపాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తగు సూచనలు చేసి మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సహకరించాలని లేకపోతే మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలను కర్ణాటకలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో శివప్రసాద్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-19T06:07:28+05:30 IST